calender_icon.png 22 September, 2024 | 1:09 PM

ఫార్మా సిటీపై స్పష్టత ఇవ్వాలె

16-09-2024 04:00:51 AM

  1. ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తే భూములను తిరిగియ్యాలె 
  2. తెలంగాణ యువతకు నష్టం చేయొద్దు 
  3. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 15(విజయక్రాంతి): హైదరాబాద్‌లో తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఫార్మాసిటీ ప్రాజెక్టును కొనసాగించే అంశం పై హైకోర్టు స్పష్టత కోరిన నేపథ్యంలో దీనిపై రేవంత్ సర్కారు విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మాసిటీ ఏర్పాటులో గందరగోళం నెలకొన్నదన్నారు.

ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటిచడంతో అక్కడ పెట్టుబడి పెట్టే సంస్థలు అయోమయంలో పడ్డాయన్నారు. ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసే ముందు రైతులను ఎందుకు సంప్రదించలేదని నిలదీశారు. దీని విషయంలో మొండిపట్టుదలకు పోయి రాజకీయాల కోసం తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీయొద్దని లేఖలో కేటీఆర్ కోరారు. ఒకవేళ ఈ ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేయాలని భావిస్తే సేకరించిన భూములను రైతులను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమ లు వచ్చేలా ఉండాలని కేటీఆర్ సూచించా రు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని ఇతర ప్రాజెక్టుల కోసం వినియోగిస్తామంటే కుదరని హైకోర్టు కూడా చెప్పినట్లు ఆయన గుర్తు చేశా రు. ఈ క్రమంలో ఫార్మా సిటీని కొనసాగిస్తే  మరింత విస్తరించేలా ఉండాలని కోరారు. 

పోరాటం చేస్తం..

లైఫ్ సెన్సైస్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయంగా నంబర్‌వన్‌గా నిలి పే ఉద్దేశంతో ఫార్మా సిటీ ప్రాజెక్ట్‌ను కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికే తెలంగాణ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తుల్లో దేశంలోనే 40 శాతం వాటా కలిగి ఉందన్నారు. ఈ రంగాన్ని మరింత ప్రోత్సహిస్తే రాష్ట్రానికి ఆదాయం పెరగడంతో పాటు యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అందించవచ్చన్న భావనతో ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు గుర్తు చేశారు. అయి తే సీఎం చేసిన ప్రకటనతో ఫార్మా సిటీ భవితవ్యం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోందని అన్నారు.

ప్రాజెక్ట్ కోసం రైతులు ఇచ్చిన భూములను ఇతర అవసరాలకు వాడతామని ప్రభు త్వం చెబుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు. భూములను ఇతర అవసరాలకు వాడుతామంటే రైతులతో కలిసి బీ ఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని హెచ్చరించారు. భూములను వేరే అవసరాలకు వాడితే న్యాయపరమైన సమస్యలు తప్పవని స్పష్టం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌తో పాటు  యువతకు నష్టం చేయొద్దని సూచించారు. ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని భావిస్తే  లైఫ్ సెన్సెన్స్‌కు రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్‌గా మార్చే అవకాశాన్ని కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు.