22-03-2025 12:00:00 AM
కాగజ్ నగర్, మార్చి21( విజయ క్రాంతి): సివిల్ సప్లయి కార్పొరేషన్ లో హమాలి కార్మికుల ను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు డిమాండ్ చేశారు. కాగజ్ నగర్ మార్కెట్ యార్డ్ ఆవరణలో శుక్రవారం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బోగే ఉపేందర్ అధ్యక్షతన జరిగిన నాలుగవ మహాసభలకు ఆయన హాజరయ్యారు.
జెండా ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను విడదీసి కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు కోడ్ తయారు చేశారని తద్వారా కార్మికులను కట్టు బానిసలుగా చేశారని ఆరోపించారు.
కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్ లను వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీలు, స్వీపర్లు దినసరి కూలీల కంటే దారుణమైన పరిస్థితిలో జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్ల నుండి రావలసిన 11 వేల కోట్ల రూపాయలు వసూలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని,ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతోపాటు పలు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ ,నాయకులు సుధాకర్, బుద్దాజీ ,దత్తు, సత్యనారాయణ, శంకర్, కొమురక్క ,అమృత ,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.