calender_icon.png 22 October, 2024 | 7:12 AM

పవన్ కల్యాణ్‌కు సిటీ సివిల్ కోర్టు నోటీసులు

22-10-2024 03:22:20 AM

  1. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని గతంలో వ్యాఖ్యానించిన పవన్
  2. నవంబర్ 22న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూలో కల్తీ విషయంలో పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని వేసిన ఓ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.

నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. వివరాలు.. జనవ రిలో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సమయంలో తిరుమల నుంచి పంపించిన లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది ఇమ్మనేని రామారావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ ఆరోపణలతో హిందూవుల మనోభావాలు దెబ్బతిన్నాయని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అలాగే తిరుమల లడ్డూ కల్తీపై పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, యూట్యూబ్‌ల  నుంచి తొలగించేలా ఆదేశాలు ఇవ్వా లని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆయా వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.  పవన్ కల్యాణ్‌తో పాటు తెలంగాణ సీఎస్ శాంతికుమారికి కూడా  కోర్టు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.