calender_icon.png 15 March, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరంజీవికి యూకేలో జీవిత సాఫల్య పురస్కారం

15-03-2025 12:00:00 AM

అగ్ర కథానాయకుడు చిరంజీవికి హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్‌లో గౌరవ సత్కారం జరగనుంది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ, యూకేకు చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా మార్చి 19న చిరంజీవిని సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ.. సినిమా, ప్రజాసేవ, దాతృత్వం విషయాల్లో చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్‌షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. అక్కడ ఇది పబ్లిక్ పాలసీని రూపొందించేందుకు పనిచేస్తుంది.

అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు, తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తోంది. దాన్ని చిరంజీవి అందుకోనుండటం విశేషం. ఈ సత్కారం చిరు కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా మారనుంది.

2006లో పద్మభూషణ్, 2024లో పద్మ విభూషణ్‌ను ఆయన అందుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు చిరుకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ స్థానం దక్కింది. ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డును సైతం చిరంజీవి గత ఏడాది అందుకున్నారు. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రం కోసం పనిచేస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు సైన్ చేశారు మెగాస్టార్.