18-03-2025 01:13:53 AM
కరింనగర్, మార్చి17 (విజయక్రాంతి): కరీంనగర్లో కాశ్మీర్ గడ్డ రైతు బజార్ అంటే తెలియని వారు ఉండరు. చాలా ఫేమస్ మార్కెట్. ప్రజలు వినియోగదారుల రద్దీ కూడా విపరీతంగానే ఉంటుంది.. కరీంనగర్ నలుమూలల నుంచి ప్రజలంతా ఇక్కడికే వచ్చి కూరగాయలు, వివిధ సామాగ్రిని ఇక్కడే కొనుగోలు చేస్తుంటారు.
ఇంతటి ప్రాధాన్యం కలిగిన రైతు బజార్ సోమవారం ఒక అరుదైన కార్యక్రమానికి వేదికగా నిలిచింది.. ఒక వినూత్నమైన కొత్త కాన్సెప్ట్ తో కూరగాయల సంతను ఏర్పాటు చేశారు. ఈ కూరగాయల సంతను ఏర్పాటు చేసింది రైతులో గ్రామీణ ప్రాంత ప్రజలో కాదు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థిని, విద్యార్థులు.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కొత్త కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఎంపిక చేసిన 12 ప్రభుత్వ పాఠశాలల నుంచి 60 మంది విద్యార్థిని విద్యార్థులతో కరీంనగర్ లోని కాశ్మీర్ గడ్డ రైతు బజార్లో మోడల్ విజిటేబుల్ మార్కెట్ (కూరగాయల సంత) ను ఏర్పాటు చేయించారు. ఈ మార్కెట్ ను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
జిల్లాలోని కరీంనగర్ ధన్గర్ వాడి, ఆసిఫ్ నగర్, బూరుగుపల్లి, మానకొండూరు, నుస్తులాపూర్, కన్నాపూర్, నాగుల మల్యాల నగునూర్, జంగపల్లి, చెల్పూర్ కొత్తపల్లి, హుజురాబాద్ బాలుర బాలికల ప్రభుత్వ పాఠశాలల నుంచి దాదాపు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు బిజినెస్ స్కిల్స్, మార్కెటింగ్ సరళి, కూరగాయల విక్రయం, కొనుగోలు, మెలకువలు, మార్కెట్ ను అంచనా వేయడం, వినియోగదారులను ఆకట్టుకునేలా వ్యవహరించడం, రైతులు పడుతున్న కష్టనష్టాలను తెలుసుకునేందుకు కలెక్టర్ వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు.
కూరగాయల సంత ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కూరగాయలు విక్రయిస్తున్న విద్యార్థిని విద్యార్థులతో చాలాసేపు ముచ్చటించారు. కూరగాయల రేట్లు, డిస్కౌంట్ ఇస్తున్న వైనం, నగదుకు సంబంధించిన లెక్కలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో బిజినెస్ స్కిల్స్ పెంపొం దించేలా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వ్యాపార రంగంలో నైపుణ్య అభివృద్ధి పెంపొందించుకుంటున్నారని కితాబు ఇచ్చారు. విద్యార్థులు సంతృప్తికరంగా జవాబులు ఇవ్వడంతో కలెక్టర్ వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
కూరగాయల విక్రయం పై వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో ఏమేం చర్యలు తీసుకోవాలో స్వయంగా కలెక్టర్ అవగాహన కల్పించారు. ప్రతి స్టాల్ ను సందర్శించి కూరగాయల రేట్లు వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్వయంగా తన డబ్బులతో కూరగాయలను విద్యార్థుల నుంచి కొనుగోలు చేశారు. అదేవిధంగా డి ఈ ఓ జనార్దన్ రావు, విద్యాశాఖ అధికారులు కూడా కూరగాయలను కొనుగోలు చేశారు. అక్కడికి వచ్చిన కలెక్టరు అధికారులు ప్రజలను కట్టుకున్న రీతిలో విద్యార్థులు కూరగాయల అమ్మకాలు సాగించారు.
సేంద్రియ పద్ధతులతో పాఠశాలల్లో పండించిన కూరగాయలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా పండించామనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు. ఈ విధంగా పండించిన కూరగాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివని ప్రజలకు సూచించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఒకవైపు విద్యార్థులకు బిజినెస్ స్కిల్స్, మార్కెటింగ్ సరళి, మరోవైపు ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరగాయల విక్రయంపై విద్యార్థులతో మార్కెట్ ఏర్పాటు చేయించడం జిల్లాలోనే రికార్డు..