11-03-2025 12:38:37 AM
పోలీస్ జాగిలం సహాయంతో దర్యాప్తు వేగవంతం
పినపాక, మార్చి 10 (విజయక్రాంతి): ఓ మిర్చి రైతు కష్టార్జితం నిప్పుల పాలయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేటలో కళ్లంలో ఆరబెట్టిన మిర్చిని గుర్తుతెలియని దుండగులు తగలబెట్టారు. ఈ ఘటనలో సుమారు 70 క్వింటాల మిర్చి దగ్ధమైనట్లు రైతు పురుషోత్తం ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ఎవరు చేశారో.. ఎందుకు చేశారో తెలియదని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట అగ్నికి ఆహుతి అయిందని రైతు, రైతు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం సుమారు 11 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. భారీగా మిర్చి దగ్ధం అవడంతో ఆ ఘాటుకి ఊర్లో జనం కొన్ని గంటల పాటు అతలాకుతులమయ్యారు.
దేశానికి అన్నం పెట్టే రైతును ఇలా చేయడం ఏంటి ఎవరు చేశారో ఆ దుండగులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.గ్రామానికి చెందిన రైతు పురుషోత్తం లక్షల రూపాయల అప్పులు చేసి కౌలుకు తీసుకొని ఆరు ఎకరాల మిర్చి పంటను సాగు చేశాడని పంటను కోసి తోటకు సమీపంలో అదే గ్రామంలో ఎండబెట్టగా ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పంటకు నిప్పు పెట్టడంతో 70 క్వింటాల పంట దగ్ధమైందని స్థానికులు అధికారులకు తెలియజేశారు .ఈ బయ్యారం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్ జాగిలం సహాయంతో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజకుమార్ దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెవిన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు దగ్ధమైన పంటను పరిశీలించి పంచనామా నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని తహశీల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీవో సునీల్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వరరావు పరిశీలించారు.