04-04-2025 12:21:47 AM
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర
హన్వాడ, ఏప్రిల్ 3: రాజ్యాంగం లో కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, బాలల రక్షణ సంరక్షణ చాలా ముఖ్యమైన అంశమని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిరా అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు చైల్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం హన్వాడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి కలలను సాకారం చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకోవాలని సూచించారు. ఉచిత న్యాయ సహాయంతో పాటు బాలలు, మహిళలకు ప్రాథమిక హక్కులను తెలియజేసేందుకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ పనిచేస్తుందని అన్నారు.
బాలల రక్షణ, సంరక్షణపై ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పించారు. 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిలో ఉండాలని సూచించారు. బాలలు ఏదైనా సమస్య వస్తే 1098 కు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాల నిర్మూలన, చైల్ ప్రొటెక్షన్ వంటి కార్యక్రమాలపై సమాజ శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు.
ఈ సమావేశంలో తహసిల్దార్ కిష్ట య్య నాయక్, పారా లీగల్ వాలంటీర్లు పల్లెమోని యాదయ్య, నాగభూషణం, శివన్న తదితరు లు పాల్గొన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి కేసుల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆశా కార్యకర్తలకు నిర్వహించిన సమావేశంలో మానసిక దివ్యాం గుల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. టీబీ రోగులకు నిక్షయ్ పోషణ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చతుర్వేది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.