09-04-2025 02:29:24 AM
సూర్యాపేట, ఏప్రిల్8 (విజయక్రాంతి): చెత్తలో కలిసిపోయే కోళ్ల వ్యర్థాలు కూడా కాసులు కురుపిస్తున్నాయి. కోళ్లను కోసిన అనంతరం వ్యర్ధంగా పడేసే పేగులు, తల, చర్మాన్ని చేపలకు ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కరోజు, రెండు రోజులు కాదు .. ఏడాదంతా ఇదే దందా . ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక వాహనాల ద్వారా ఓ ముఠా ఈ వ్యర్థాలను రహస్యంగా చేపల చెరువులకు తరలిస్తోంది.
ఈ వ్యర్థాలను తిన్న చేపలను మనుషులు తింటే క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయనేది నిజం. ఈ మాఫియా దందా జిల్లా పరిధిలో జోరు జరుగుతున్నది. ఇంత జరుగుతున్నా .. పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ, ఫిషరీష్ తదితర శాఖల అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రతినెలా మాఫియా ముట్టజెప్పే కాసులకు కక్కుర్తిపడి ఈ దందాపై కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
మాఫియాకు చికెన్ మార్కెట్ల అడ్డా ...
సూర్యాపేట మున్సిపాలిటీలో పాటు కోదాడ, తుంగతూర్తి, హుజుర్నగర్, నేరెడుచర్ల తదితర ప్రాంతాల్లోని చికెన్ మార్కెట్లు మాఫియాకు అడ్డాగా మారుతున్నాయి. జిల్లాకు చెందిన కోదాడ, నేరెడుచర్ల, హుజుర్నగర్కు సంబంధించిన ముఠా బహిరంగంగా ఈ దందా నిర్వహిస్తోంది. ఈ ముఠాకు మున్సిపాలిటీ అధికారులతోపాటు చికెన్ మార్కెట్ వ్యాపారులు సహకరిస్తున్నారు.
చికెన్ వ్యర్థాల సేకరనే టార్గెట్ ..
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొందరు ముఠా సభ్యులు ప్రత్యేక వాహనాల్లో చికెన్ మార్కెట్లకు చేరుకుంటారు. వాహనంలో ముందుగానే ఏర్పాటు చేసుకున్న భారీ ప్లాస్టిక్ డ్రమ్ము కోళ్ల నుంచి తీసిన పేగులు, తల, కాళ్లు, చర్మం, ఈకలు సేకరిస్తారు. ఇలా ఒక్కో ట్రిప్పుకు సుమారు 2టన్నుల వ్యర్థాలను సేకరిస్తున్నారు. ఒక్క జిల్లా కేంద్రం నుండే రోజు నాలుగు వాహణాలలో అంటే 8 టన్నుల వ్యర్దలను సేకరిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా రోజుకు 20 టన్నుల వ్యర్ధాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేవారు. అయితే ఈ మాఫియా క్యాట్పిష్ పెంపకానికి సేకరించడంపై దృష్టి పెట్టడంతో వ్యాపారులు మున్సిపల్ సిబ్బందికి వ్యర్థాలను ఇచ్చేందుకు నిరాకరించారు . వ్యర్థాలను తరలించడానికి ఈ మాఫియా అధికారులకు ప్రతినెలా మామూళ్లు ముట్టజెప్పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
వ్యర్థాల అక్రమమార్గంతో ఆదాయానికి గండి
మున్సిపాలిటీలకు వ్యర్థాలు కూడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా గతంలో నిబంధనలు రూపొందించారు. టన్ను వ్యర్థానికి రూ. వెయ్యి ఆదాయం వస్తుందని అంచనా వేశారు. వ్యర్ధాల సేకరణ పనులకు కాంట్రాక్టర్ను ఏర్పాటు చేయవలసి ఉన్నది.
ఇలా చేసి ఉంటే జిల్లాలో ప్రతిరోజు సుమారు 8 వేల చొప్పున ఆదాయం సమకూరే అవకాశం ఉంది . అయితే ఇప్పటివరకు వ్చర్ధాల సేకరణకు ఏటాంటి చర్యలు తీసుకోలేదు. పైగా కొందరు అధికారుల అండదండలతో ఈ వ్యర్థాలను అక్రమ మార్గాల్లో చేపల చెరువులకు తరలిస్తున్నారు.
చేపల పెంపకానికి చికెన్ వ్యర్ధాలు వాడరాదు..
చేపలకు ఆహారంగా చికెన్ వ్యర్ధాలను వాడరాదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వెలువడుతాయి. చేపల పెంపక దారులు చికెన్ వ్యర్ధాలను వాడుతున్నట్లు రుజువయితే కేసు నమోదు చేస్తాము.
నాగులు, జిల్లా మత్స్యశాఖ అధికారి