calender_icon.png 9 October, 2024 | 3:55 AM

వడ్డెపల్లిలో చిరుత సంచారం

09-10-2024 01:41:48 AM

భయాందోళనలో రైతులు

దౌల్తాబాద్, అక్టోబర్ 8: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వడ్డెపల్లి గ్రామ శివారులో గల దేవుని గుట్ట సమీప పంట పొలాల వద్ద రెండు పిల్లలతో చిరుత సంచరించడం కలకలం రేపింది. స్థానిక రైతులు, వ్యవసాయ కూలీలు మంగళవారం చిరుతతో పాటు రెండు పిల్లలను గమనించారు. ఈ విషయంపై గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

దీంతో అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని చిరుత ఆనవాళ్లను పరిశీలించారు. కాగా, కొద్ది నెలల క్రితం గ్రామానికి చెందిన గడ్డం బిక్షపతి అనే రైతు వ్యవసాయ బావి వద్ద కనిపించిన చిరుత పులి తాజాగా రెండు పిల్లలతో కలిసి దేవుని గుట్ట వద్ద కుక్కను వెంటాడుతూ కనిపించిందని స్థానికులు తెలిపారు.

చిరుతను పట్టుకునేందుకు ఆ ప్రాం తంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ అధికారులు వెల్లడించారు. రైతులు, కూలీలు ఒంటరిగా పంట పొలాల వద్దకు వెళ్లొద్దని సూచించారు. బావుల వద్ద పశువులను కట్టెయవద్దని తెలిపారు.