ఎద్దుపై దాడితో నిర్దారణ
సమీప ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
అటవీ, పోలీసు అధికారుల సూచన.....
పరిగి (విజయక్రాంతి): పొలం వద్ద కట్టేసి ఉన్న ఎద్దుపై దాడి జరిగింది. ఈ దాడిలో ఎద్దు అక్కడిక్కడే మృతి చెందింది. అయితే ఎద్దుపై చోటు చేసుకున్న గాయం చిరుత పులి జంతువుది అయి ఉంటుందని, పొలంలో కూడా పులి అడుగులు కనిపించడం కలకలం రేపుతోంది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం రేళ్లగడ్డ తాండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాండాకు చెందిన మూడవత్ గోప్యా నాయక్ తన ఎద్దులు, ఆవులను ఊరిబయట ఉన్న పొలం వద్ద రోజు మాదిరిగానే కట్టేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం వచ్చి చూసే సరికి ఓ ఎద్దు గాయాలతో మృతి చెందింది. గాయంపై క్రూర జంతువు దాడి చేసినట్లు గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీనికి తోడూ పొలంలో పులి, లేదా హైనా జంతువు అడుగులు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సంబంధిత శాఖ అధికారులు, ప్రభుత్వం ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎద్దు మృతిపై కుటుంబ సభ్యులు రోధించారు. తమను ఆదుకోవాలని కోరారు.