calender_icon.png 4 October, 2024 | 10:54 AM

ఆయుర్వేదంతో హైబీపీకి చెక్

09-09-2024 02:30:00 AM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 మందిలో 90 మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. నేటి జీవనశైలి, ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అనేక అంశాలు హైబీపీకి కారణమవుతున్నాయి. శరీరంలోని గుండె, మూత్రపిండాలు, లివర్, బ్రెయిన్ వంటి వాటిపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది. అందుకే బీపీని తప్పనిసరిగా అదుపులో ఉంచుకోవాలి. లేదంటే ప్రమాదమే. 

హైబీపీ ఉన్నవారిలో రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. దీనివల్ల గుండె, మెదడుపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది మరింత ఎక్కువైతే ఇతర అవయవాలు కూడా ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి  హైబీపీ ఉన్నవాళ్లు ఒత్తిడి లేని జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి. దీనికోసం డైట్లో కొన్ని మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అయితే అధిక రక్తపోటు నియంత్రణ చాలామందికి సవాలు లాంటిది. అయితే మందులు వాడే బదులు సహజంగానే బీపీ భయం పొగొట్టుకోవచ్చు. ఆయుర్వేద గుణాలు కలిగిన ఔషధ పదార్థాలతో రక్తపోటు స్థాయిలను సమతుల్యం చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోండి. 

తులసి, అల్లం టీ

తులసి, అల్లం కలిపిన టీలో బోలెడు ప్రయోజనాలున్నాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచి మందుగా పనిచేస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా  తాజా తులసి ఆకులు, అల్లం ముక్కలను 2 కప్పుల నీటిలో 5-7 నిమిషాలు ఉడకబెట్టండి. ఆ తర్వాత టీని తాగాలి. ఈ టీ క్రమం తప్పకుండా తాగితే.. బరువు తగ్గడం, జలుబు, దగ్గు తగ్గుతాయి. రోగనిరోధక శక్తికి కూడా బాగా పనిచేస్తుంది. కొందరు తలనొప్పి కారణంగా తీవ్ర ఒత్తిడితో బాధపడుతుంటారు. అలాంటివారు తులసి, అల్లంతో డికాక్షన్ చేసుకొని, అందులో కొంత ఉప్పు వేసి తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. రోజకు నాలుగైదు సార్లు 6-7 తులసి ఆకులు నమిలినా కూడా మంచి ఫలితం ఉంటుంది. 

జిలకర, కొత్తిమీర, సోంపు టీ

జిలకర, కొత్తిమీర, సోంపు విత్తనాలతో ఈ టీని చేసుకోవచ్చు. ఇది పలు అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి మంచి చేస్తుంది. మూడు రకాల విత్తనాలు (1 టీస్పూన్) 2 కప్పుల నీటిలో 5-10 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత వడకట్టి తాగాలి. ఇలా రెగ్యులర్‌గా తాగడం వల్ల హైబీపీని నియంత్రించుకోవచ్చు. ఈ టీ దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే.. హైబీపీతోపాటు ఇతర అనారోగ్య సమస్యలనూ దూరం చేసుకోవచ్చు. 

బీట్ రూట్ జ్యూస్

బీట్ రూట్ లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. ప్రతిరోజు బీట్ రూట్లను జ్యూస్ చేసి తాగితే బీపీకి చెక్ పెట్టొచ్చు. ఇక వీటిలో విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆర్థరైటిస్, కీళ్లనొప్పుల సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. 

దానిమ్మ జ్యూస్

దానిమ్మ రసంలో గుండె ఆరోగ్యానికి తో డ్పడే యాంటీఆక్సిడెం ట్లు అధికంగా ఉంటా యి. రోజు రెండు దాని మ్మ పండ్ల రసం తీసి తాజాగా తాగాలి. ఈ జ్యూస్ తో బీపీని తగ్గించుకోవచ్చు. దానిమ్మలో  ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, ఐరన్, విటమిన్ సి, పొటాషియం, ఫాస్పరస్ లాంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడతాయి. దానిమ్మ జ్యూస్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.   జీర్ణక్రియతోపాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది. 

ఉసిరి రసం

ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తాజా ఉసిరి పండ్ల రసంలో నీరు లేదా తేనె మిక్స్ చేసి రోజూ తాగాలి. ఇందులోని క్రోమియం ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి కొన్ని కణాలకు సహాయపడుతుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది అదనపు గ్లూకోజ్ కంటెంట్ ను ఉపయోగించుకునేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఇది జీవక్రియ శక్తిని పెంచుతుంది.  

తేలిగ్గా తీసుకోవద్దు

బీపీని తరచుగా పర్యవేక్షిస్తుండకపోతే చాలా తీవ్రమైన జబ్బులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. గుండె జబ్బులకు దారి తీయడంతో పాటు మరణానికి కూడా కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. తరచుగా బీపీని చెక్ చేసుకుంటూ, జీవన శైలిలో సరైన మార్పుల ద్వారా బీపీని నియంత్రించుకున్నట్లయితే ఎలాంటి ప్రమాదం ఉండదని కూడా డాక్టర్లు చెబుతున్నారు.

గతంలో 50-నుంచి 60ఏళ్ల తర్వాత బీపీ సమస్య మొదలయ్యేది. కానీ, ఇప్పుడు పిల్లలు కూడా హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. బీపీ రావడానికి ప్రధాన కారణం ఉబకాయం. ఒత్తిడి, నిద్రలేమి, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా హైబీపీ వస్తుంది

ఇలా చెక్ చేసుకోండి

  1. గతంలో వైద్యులు బీపీని చూడటానికి పాదరసం ఉండే స్పిగ్మోమానోమీటర్లను వాడేవారు. కానీ, ఇప్పుడు బీపీని కొలవడానికి ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు నాణ్యమైన బీపీ పరికరాల ధర రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్య ఉంటుంది. అయితే, ఈ పరికరాలతో బీపీని పరీక్షించే విధానాన్ని ఒకసారి డాక్టర్ లేదా నర్సు ద్వారా తెలుసుకోవాలి.
  2. బీపీని చెక్ చేసుకోవడానికి పావుగంట లేదా 20 నిమిషాల ముందు టీ లేదా కాఫీ తాగొద్దు. ఆల్కహాల్, సిగరెట్ తాగిన తర్వాత కూడా బీపీని పరీక్షించకూడదు. బీపీ పరీక్షించే సమయంలో ప్రశాంతంగా ఉండాలి. కుర్చీలో రిలాక్స్‌గా కూర్చోవాలి. కుర్చీలో వెనక్కి వాలి, పాదాలను నేలకు తగిలేలా కూర్చోవాలి. అలాగే కాళ్లను ముడుచుకోకూడదు. కాలిపై కాలు వేసుకోకూడదు. 
  3. పరీక్షించే సమయంలో రక్తపోటు ఎక్కువగా ఉన్నట్లుగా చూపిస్తే, ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. కుడి, ఎడమ ఇలా రెండు చేతుల్ని ఉపయోగించి బీపీ పరీక్షించుకోవచ్చు. వచ్చిన ఫలితాల సగటును లెక్కవేయాలి.