మెడికవర్ ఆసుపత్రి చైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ అనిల్ కృష్ణ
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా శనివారం మెడికవర్ ఆసుపత్రిలో అత్యాధునిక ఏఈడీ(ఆటోమేటెడ్ ఎక్ట్సర్నల్ డీఫిబ్రిలేటర్)ను ఆసుపత్రి చైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ అనిల్ కృష్ణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కారణంగా ప్రస్తుతం వృద్ధుల్లోనే కాకుండా యువతలో కూడా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని అన్నారు.
దేశంలో గుండె జబ్బుల వలనే అత్యధికులు చనిపోతున్నారని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఎవరికైనా హఠాత్తుగా గుండెపోటు వస్తే తక్షణమే ఏఈడీతో ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే గుండె కొట్టుకోవడం ఆరంభిస్తుందన్నారు.
తర్వాత వీలైనంత త్వరగా బాధితుల్ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి డైరెక్టర్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.