13-12-2024 12:40:42 AM
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): కులం పేరుతో సమాజంలో అవమానాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటి పేరు మార్చాలని పలు కులసంఘాల నాయకులు బీసీ కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లాల్లో ఇటీవల నిర్వహించిన బహిరంగ విచారణలో పాల్గొని కులాల పేరు మార్పుపై విజ్ఞప్తి చేసిన పలు సంఘాల ప్రతినిధులతో బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ తమ కార్యాలయంలో గురువారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కులం పేరులో మార్పు కోరిన వారి నుంచి అభిప్రాయాలు సేకరించింది. దొమ్మర, వంశరాజ్, తమ్మలి కుల సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరై తమ కులాల స్థితిగతుల గురించి వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దొమ్మర కులం వారు తమ కులం పేరును గడవంశీగా మార్చాలని..
వంశరాజ్ కులం వారు తమ కులం పేరులో నుంచి పిచ్చిగుంట్ల అనే పదాన్ని పూర్తిగా తొలగించాలని, తమ్మలి కులం వారు నాన్ బ్రాహ్మిణ్, సూద్రా క్యాస్ట్ అనే పదాలను తొలగించాలని కమిషన్ను కోరారు. ఈ పదాలతో తాము సమాజంలో అనేక అవమానాలు ఎదుర్కొంటున్నామని ఆయా కుల సంఘాల నాయకులు ఆరే రాము లు, మురళీకృష్ణ, వటపత్ర సాయి ఆవేదన వ్యక్తం చేశారు.
సమావేశంలో బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ సతీశ్కుమార్, రీసెర్చ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.