07-03-2025 12:00:00 AM
చేర్యాల, మార్చి 6: సాగునీటి ఇబ్బందుల తెలుసుకోవడానికి మద్దూరు, చేర్యాల, కొమరవెల్లి మండలాలలో భువనగిరి ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రైతులు తీసుకొచ్చిన సమస్యల పరిష్కారం కోసం భారీ నీటి పారుదల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని ఎంపీ స్థానిక నాయకులను వెంటబెట్టుకొని ఆయన ఛాంబర్లో గురువారం కలిశారు. ఈ సందర్భంగా రంగనాయక సాగర్ నుండి వచ్చే నీటిని మద్దూరు, దుల్మీట మండలాల రైతులకు అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. తక్కువ ఖర్చుతోనే ఈ రెండు మండలాల్లోని ఐదారు గ్రామాలకు సాగునీరు అందించవచ్చు అని ఆయనకు వివరించారు.
రంగనాయక సాగర్ నుంచి వచ్చే కెనాల్ ను తపాస్ పల్లి నుంచి వచ్చే కెనాల్ కు అనుసంధానం చేసి, వీటి మధ్య కల్వర్టు ఒకటి నిర్మిస్తే సరిపోతుందని తెలిపారు. తక్కువ ఖర్చుతో సుమారు 6వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు అన్నారు. అదేవిధంగా తపాస్ పల్లి రిజర్వాయర్ కు సాగునీరు త్వరగా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్, మాజీ జెడ్పిటిసిలు కొమ్ము నర్సింగరావు, గిరి కొండల్ రెడ్డి తదితరులు ఉన్నారు.