22-03-2025 12:28:19 AM
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): దేశ రైతాంగాన్ని కేంద్ర ప్రభు త్వం పట్టించుకోవడంలో విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, బడ్జెట్లో 3.8 శాతం మాత్రమే కేటాయించినట్టు విమర్శించారు. శుక్రవారం లోక్సభలో వ్యవసాయానికి కేటాయించిన గ్రాంట్స్పై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా చామల మాట్లాడారు.‘సబ్ కా సాత్P సబ్ కా వికాస్, అచ్చేదిన్ ఆనే వాలే హై. వికసిత్ భారత్, ఆత్మనిర్బర భారత్, ఘర్ ఘర్ రోజ్గార్’ అనేవి నినాదాలకే పరిమితమయ్యాయనని ఎద్దేవా చేశారు. గతేడాది బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ. 1.41 లక్షల కోట్లు కేటాయించ గా.. ఈసారి దానిని రూ. 1.37 లక్షల కోట్లకు తగ్గించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
కార్పొరేట్లకు రూ. 3 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన కేంద్రం గత పదేళ్లలో రైతులకు ఎన్ని లక్షల కోట్లు రుణమాఫీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా సన్న చిన్న, సన్నకారు రైతుకు రుణమాఫీ చేయాలని, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పారదర్శకంగా అందజేయాలని కోరారు. పంటలకు కనీస మద్దతు ధర, ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయడంలో విఫలమైందన్నారు.