calender_icon.png 17 April, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపద్భాంధవులకు కేంద్రం భరోసా..!

08-04-2025 12:00:00 AM

గుడ్ సమరిటన్ పథకంతో గుర్తింపు

సాయం చేసిన చేతులకు ప్రోత్సాహం

రూ.5వేల నగదు, ప్రశంసాపత్రం

జిల్లాలో అవగాహన కరువు

మెదక్, ఏప్రిల్ 7(విజయక్రాంతి) : రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021లో గుడ్ సమరిటన్ పథకానికి శ్రీకారం చుట్టింది. జాతీయ స్థాయి అవార్డులకు అవకాశంతో పాటు రూ.5వేల నగదు, ప్రశంసాపత్రం అందిస్తోంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తీసుకెళ్తే కేసు, పోలీసుల పంచాయితీ ఉంటుందని గతంలో సాయం చేసేందుకు వెనుకాడేవారు. ప్రస్తుతం అవగాహన పెరగడంతో పాటు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. 108 వాహనం అందుబాటులో లేకపోతే తమ వాహనంలో, ఇతర వాహనాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చుతున్నారు. గుడ్ సమరిటన్ పథకం ద్వారా ఇలాంటి వారికి ప్రోత్సాహం లభిస్తోంది. 

ప్రాణాలను నిలబెట్టి...

సకాలంలో వైద్యం అందక రోడ్డు ప్రమాద బాధితుల్లో దాదాపు 50 శాతం  మృతి చెందుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరు సాయం చేయకపోగా సంఘటనా స్థలంలో క్షతగాత్రులను వీడియో, ఫోటోలు తీసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సమరిటన్ పథకం అందరినీ సాయం చేసేలా ప్రోత్సహిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు 108 అంబులెన్స్ రావడం సైతం ఇబ్బందికరంగా మారుతోంది. అలాంటి సమయాల్లో చాలామంది ఆటోలు, ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్తున్నారు. సరియైన సమయంలో ఆసుపత్రులకు తరలించడం ద్వారా ప్రాణాలను నిలబెడుతున్నారు. 

నగదు ప్రోత్సాహకం...

ప్రమాదం జరిగిన గంటలోగా ఆసుపత్రికి తీసుకొస్తే ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్నే గోల్డెన్ అవర్గా పేర్కొంటున్నారు. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన సమరిటన్ తో గోల్డెన్ అవర్లో ఆసుపత్రిలో చేర్చిన వారికి రూ.5వేలు అందనున్నాయి. ఇందుకు దరఖాస్తు చేసుకోవాలంటే పోలీస్ స్టేషన్ ఎస్హెచ్‌ఓలు లెటర్ ప్య్పా వివరాలు రాసి ఇవ్వాల్సి ఉంటుంది. పోలీసులు కూడా కేసుతో సంబంధం లేకుండా రాసివ్వాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్సీ కోడ్ జత చేస్తే నేరుగా వారి ఖాతాలో నగదు జమ అవుతుంది. ప్రశంసాపత్రం కూడా అందుతుంది. సంవత్సరానికి గరిష్టంగా ఐదు అవార్డులు ఇస్తారు. అత్యంత విలువైన మంచి సహాయకులకు ఒక్కొక్కరికి రూ.లక్ష నగదు, జాతీయ స్థాయి అవార్డులు సైతం ఇస్తారు. అయితే ఈ పథకంపై సమగ్రంగా ప్రచారం చేసి అవగాహన కల్పిస్తే మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

ప్రజలను చైతన్యం చేస్తాం..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గుడ్ సమరిటన్ పథకంపై ప్రజలను చైతన్యం చేస్తాం. అవగాహన సమావేశాలు నిర్వహించేలా స్థానిక పోలీసులకు, వివిధ శాఖల అధికారులకు సూచిస్తాం. గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చేర్పిస్తే గుర్తింపు లభిస్తుంది. దాంతోపాటు ఆర్థిక సహకారం అందుతుంది.

-ఉదయ్కుమార్రెడ్డి, మెదక్ జిల్లా ఎస్పీ