విధివిధానాలపై చర్చ
మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేయడానికి వేగంగా అడుగులు వేస్తుంది. కులగణనపై షెడ్యూల్ ఖరారు చేయడానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో సచివాలయంలో కీలక సమావేశం జరిగింది.
కులగణనను నెల రోజుల్లో పూర్తిచేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకు న్నారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్, సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్రెడ్డి, లా సెక్రటరీ రాజశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బీసీల్లో రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ప్రభు త్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే కులగణన కోసం అసెంబ్లీలో, క్యాబినెట్లో కూడా తీర్మానం చేసింది. అయితే కులగణన ఎలా చేయాలనే అంశంపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో చేసిన కులగణనపై అధ్యయనం చేశారు.
కర్ణాటక, బీహార్, ఏపీలో చేసిన కులగణనపై సమావేశంలో చర్చించారు. కర్ణాటకలో బీసీ కమిషన్ చేసిన సర్వే, బీహార్లో జీఏడీ ద్వారా చేసిన సర్వే, ఏపీలో పంచాయతీరాజ్ ద్వారా సర్వే చేసిన అంశాలపై చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో డోర్ టూ డోర్ పూర్తిస్థాయి సర్వే నిర్వహించారు. ఇందులో మూడు రాష్ట్రాల్లో చేసిన బెస్ట్ పాలసీని తీసుకుని ఇక్కడ అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
దీంతోపాటు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడం, ప్రభుత్వం నుంచి వర్గీకరణపై సబ్ కమిటీ సమావేశాలు కొనసాగుతుండటంతో కులగణన సర్వే నివేదిక ఎస్సీ వర్గీకరణకు కూడా అవసరం ఉంటుంది. కాబట్టి పూర్తిస్థాయి కులాల గణన చేసి వారికి అవసరమైన డేటా తీసుకునేలా చేసే అంశంపై చర్చించారు.
రిపోర్టు పారదర్శకంగా ఉండటానికి ఇరుశాఖలకు సంబంధం లేకుండా కులగణన జీఏడీ లేదా పంచాయతీరాజ్, రెవెన్యూలో దేని ద్వారా చేయించాలనే దానిపై రెండు రోజుల్లో సీనియర్ మంత్రులతో ప్రభుత్వం కీలక సమా వేశం ఏర్పాటు చేయనుందని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కులగణనకు సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో మానిట రింగ్ చేసేలా ఉండాలని సూచించారు.