20-04-2025 12:10:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): జలమండలి సరఫరా చేస్తున్నమంచినీటి పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్న ఓ వ్యక్తిపై విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జలమండలి ఓఅండ్ ఎం డివిజన్ -6, బంజారా హిల్స్ సెక్షన్ పరిధిలోని నిమ్స్ విస్తరణ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న భవన ప్రాంగణంలో అధికారుల అనుమతి లేకుండా అక్రమ నల్లా కనెక్షన్ తీసుకున్నారు.
నగరంలో కొనసాగుతున్న మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ భాగంగా జలమండలి విజిలెన్స్ అధికారుల తనిఖీలో బయటపడ్డ ఈ విషయం పై సంబంధిత ప్రాజెక్టు ఇంచార్జి నాగేంద్ర బాబుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్లో యు/ఎస్ 326(ఎ), బియెన్ఎస్ 303(2) సెక్షన్ల కింద, పీడీపీపీ చట్టం ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. అధికారుల అనుమతి లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.