- ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని అభియోగం
- కేసు నమోదుకు బెంగళూరు కోర్టు ఆదేశం
బెంగళూరు, సెప్టెంబర్ 28: ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత రి నిర్మలా సీతారామన్పై కేసు నమోదుచేయాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు పోలీసులను శనివారం ఆదేశించింది.
సుప్రీంకోర్టు రద్దుచేసిన ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆమె ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని జనాధికార సంఘర్ష సంఘటనె అనే సంస్థ నాయకుడు ఆదర్శ్ ఐయ్యర్ ఫిర్యాదు చేయటంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాలతో కేంద్ర మంత్రిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
నిర్మలమ్మ రాజీనామా చేయాలి: సిద్ధరామయ్య
ముడా కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్పై ఎఫ్ఐఆర్ నమోదుకావటంపై వెంటనే స్పందించారు. తనను సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నదని.. ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మలా సీతారామన్తోపాటు జేడీఎస్ నేత కుమారస్వామి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాలతో నిర్మలాసీతారామన్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎవరామె? ఆమె ఒక కేంద్ర మంత్ర ఆమెపై కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. అందువల్ల ఇప్పుడు ఆమె కూడా మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ ప్రకారం ఈ కేసులో కూడా దర్యాప్తును మూడు నెలల్లో పూర్తిచేసి కోర్టుకు నివేదిక సమర్పించాలి. నా కేసులో మూడు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసులోనూ అలాగే చేయాలి’ అని డిమాండ్ చేశారు.