calender_icon.png 19 October, 2024 | 5:05 AM

హరీశ్‌రావు బంధువులపై కేసు

19-10-2024 02:18:16 AM

తన ఆస్తి కాజేశారని దండు

లచ్చిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు

శేరిలింగంపల్లి,  అక్టోబర్ 18 (విజయక్రాంతి) : మాజీ మంత్రి హరీశ్‌రావు బంధు వులు తన ప్రాపర్టీని ఆక్రమించారని ఓ వ్యక్తి మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దండు లచ్చిరాజు అనే  వ్యక్తికి మియాపూర్‌లో ఐదంతస్తుల భవనం ఉంది.

అయితే ఆ భవనాన్ని మాజీ మంత్రి బంధువులు తన్నీరు గౌతం, బోయినపల్లి వెంకటేశ్వర రావు, తన్నీరు పద్మజారావుతో పాటు మరో ముగ్గురు గోని రాజకుమార్‌గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావ తిలు ఆక్రమించారని బాధితుడు ఫిర్యాదు లో పేర్కొన్నారు.

దీంతో మొత్తం ఆరుగురిపై మియాపూర్ పోలీసులు 420,448,504, 506 రెడ్ విత్34ఐపీసీ సెక్షన్లతో పాటు ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ నెల 5న బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

కేసు నేపథ్యం..

దండు లచ్చిరాజు అనే వ్యక్తికి మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాతృశ్రీ నగర్‌లో ఐదు అంతస్తుల భవనం ఉంది. లచ్చిరాజు నుంచి జీపీఏ చేసుకున్న చిట్టిబాబు ఆ స్థలంలోకి వెళ్లేందుకు ప్రయత్నిం చగా మాజీ మంత్రి హరీశ్‌రావు బంధువులైనా తన్నీరు గౌతం, బోయినపల్లి వెంకటేశ్వ రరావు, గోని రాజకుమార్‌గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు అడ్డుకున్నారని బాధితుడు తెలి పారు.

అయితే ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో పలు కారణాలు చెప్పి తన నుంచి బ్లాంక్ చెక్, బ్లాంక్ ప్రామిసరీ నోటు తీసుకుని మాజీ మంత్రి బంధువులు చీటింగ్‌కు పాల్పడ్డారని, తనకు తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు వ్యతిరేకంగా ఇంజంక్షన్ ఆర్డర్ కూడా తెచ్చారని ఆరోపించారు.

ఈ విషయంపై 2019 నుంచి పోరాడుతున్నా తనకు న్యాయం జరగడం లేదని బాధితుడు వాపోయినట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించేందుకు మియాపూర్ సీఐ క్రాంతి కుమార్ నిరాకరించారు. వారు హరీశ్‌రావు బంధువులా? కాదా అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు.