20-03-2025 10:29:21 AM
కానిస్టేబుల్ మృతి మరొక కానిస్టేబుల్ కు గాయాలు
కామారెడ్డి జిల్లా గాంధారిలో అర్ధరాత్రి ఘటన
కామారెడ్డి, (విజయక్రాంతి): తప్ప తాగిన ఓ వ్యక్తి అర్థరాత్రి కారుతో వీరంగం సృష్టించారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ లను ఢీకొనడంతో ఒక కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందగా మరో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ ప్రాక్టీషనర్ కుమారుడు మద్యం సేవించి కారులో ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో గాంధారి హనుమాన్ టిఫిన్ సెంటర్ ఎదుట పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు రవికుమార్ , సుభాష్ ను కారు ఢీ కొనడంతో రవికుమార్ ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. కారు ఢీకొనడంతో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో కానిస్టేబుల్ సుభాష్ గాయాలతో బయటపడ్డారు. పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాంధారి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రవికుమార్ కు ఏడాది వయసు గల బాబు ఉన్నాడు. విధుల నిర్వహణకు ఇంటి నుంచి బుధవారం రాత్రి వెళ్ళిన రవికుమార్ ఉదయం శవమై తిరిగి రావడంతో ఆ కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. విధులు నిర్వహిస్తున్న పోలీసుల పై తప్ప తాగిన మైకంలో కారు తో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.