calender_icon.png 9 October, 2024 | 4:52 PM

బీఆర్‌ఎస్ హయాంలోనే చెరువుల కబ్జా

09-10-2024 02:24:33 AM

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు  

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఇందిరాగాంధీ హయాంలో పేదలకిచ్చిన భూములు బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక దొరల చేతుల్లోకి పోయాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలోనే  ఎక్కువగా చెరువులు కబ్జాకు గురయ్యాయని ఆయన ఆరోపించారు.

మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను ‘ నీరుL మీరు ’ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్ నాయకుడు సుధాకర్‌రెడ్డి కబ్జా చేశాడని వీహెచ్ పేర్కొన్నారు. చెరువును ఆక్రమించినట్లుగా తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో మహ్మద్ అజం అనే వ్యక్తి బతుకమ్మ కుంట చెరువును ప్రభుత్వానికి అప్పజెప్పాడని   గుర్తు చేశారు.

కేసీఆర్ కూతురు బతుకమ్మను నిర్వహించిందని, కానీ బతుకమ్మ కుంటను కాపాడలేదని ఆవేదన వ్యక్తం చేవారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నగరంలోని చెరువులతో పాటు బతుకమ్మ కుంటను కాపాడాలని, చెరువును ఆక్రమించిన సుధాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నాయకులు కళ్లు తెరవాలని, లేదంటే మహిళలే చీపురుతో కొడుతారని ఆయన హెచ్చరించారు.