calender_icon.png 19 March, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వయం ఉపాధికి ఊతం ఇవ్వలేరా?

14-02-2025 12:00:00 AM

పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ కారణంగా ఈ సంఖ్య తీవ్రమైంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వీరికి ఒరిగిందేమీ లేదు. స్వయంకృషితో పదిమందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చి పరిశ్రమలు స్థాపిస్తున్న వారికి ప్రోత్సాహం కరువవుతున్నది.

భారతదేశంలో సుమారు 50 కోట్లమంది స్వయంఉపాధి రంగంలో ఉన్నార ని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని ‘ఐఎస్‌ఓ’ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డుజేషన్) నివేదించింది. ఒకరిమీద ఆధారపడకుండా స్వయంఉపాధి చూసుకోవాలని మన నేతలు నిత్యం చేసే ప్రచారాన్ని చూసి ఇది మంచిదే అని అనుకోడానికి లేదు. ఎందుకంటే, దేశంలో స్వయంఉపాధి రంగం పరిస్థితి దారుణంగా ఉంది.

ఈ రంగంలో స్థిరపడాలనుకునే వారికి  మద్దతు ఉండ దు. ఉద్యమి మిత్ర, ఫుడ్ ప్రాసెసింగ్ యూ నిట్లు,  గోపా ల మిత్ర, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ప్రధా న మంత్రి సంచాయిని యో జన వంటివన్నీ దండగమారి పథకాలే. 2022 లెక్కల ప్రకారం ఉద్యోగం పొందిన భారతీయుడు సగటున నెలకు 19,000 రూపాయల వేతనం పొందుతుంటే, స్వయంఉపాధి రంగంలో రూ.11,973 మాత్రమే ఆదా యం లభిస్తున్నది.

క్యాజువల్ కార్మికులు సగటున నెలకు కేవలం రూ. 8,267 మాత్రమే వేతనం పొందుతున్నారు. వీళ్లలోనూ స్త్రీ పురుషుల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉం టుంది. స్వయంఉపాధిలో స్త్రీల ఆదాయం మరీ తక్కువ. వారి కష్టాన్ని సరిగ్గా లెక్కించడం లేదు.  

మన దేశంలో యువత ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనే రేటు అంటే శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు) కూడా గణనీయంగా తగ్గిపోతు న్నది. 2000 సం॥లో ఈ రేటు 54 శాతం ఉండగా 2022 నాటికి 42 శాతానికి పడిపోయింది. శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు అంటే ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్న 16 సంవత్సరాల వయసుగల శ్రామిక జనాభాలో ఉపాధి కోరుకునే వారి జనాభా శాతం.

ఇది ఒక కీలకమైన ఆర్థిక సూచిక. గత రెండు దశాబ్దాలుగా ఇది గణనీయంగా పడిపోయింది. జనాభాలో కార్మికుల సంఖ్యకూడా 2000 సం॥లో 60.2 శాతం నుంచి 2022 నాటికి 52.9 శాతానికి పడిపోయింది. కార్మిక భాగస్వామ్య రేటు పురుషుల కన్నా మహిళల్లో ఎక్కువ పడిపోయింది. 2000 మధ్య పురుషుల్లో ఇది 8.1 శాతం పడిపోగా, మహిళల్లో 14.4 శాతం పడిపోయింది.

2000 సం॥ల మధ్య మొత్తం ఉద్యోగాల్లో నైపుణ్య ఉద్యోగాలు పెరుగుతూ వచ్చాయి. ఈ కాలంలో మధ్య స్థాయి, ఉన్నత స్థాయి నైపుణ్య ఉద్యోగాలు 5.1 శాతం నుంచి 9.6 శాతానికి పెరగ్గా, తక్కువ నైపుణ్య ఉద్యోగాలు 60.5 శాతం నుంచి 65.1 శాతం పెరిగాయి. నైపుణ్యం లేని ఉద్యోగాలు ఈ కాలంలో 34.4 శాతం నుంచి 25 శాతానికి తగ్గాయి.

కానీ, 2019 మధ్య ఈ ధోరణి తిరగబడింది. ఈ కాలంలో తక్కువ నైపుణ్యం గల ఉద్యోగాలు పెరుగుతూ మధ్య, ఉన్నత స్థాయి నైపుణ్య ఉద్యోగాలు తగ్గుతూ వచ్చాయి. ‘స్కిల్ ఇండియా’ పేరుతో యు వతలో నైపుణ్యాలను పెంచుతున్నామని, వారిని యువ వ్యాపారవేత్తలుగా మారుస్తున్నారని కేంద్రంలో మోదీ ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉన్నాయి. 

నిపుణులకు ఉద్యోగాల కొరత

యువకుల నైపుణ్యాలు పెంచి వారిని పారిశ్రామిక కార్మికులుగా తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటిఐ)లు నెలకొల్పారు. కానీ, ‘ఐటిఐ’ల నుంచి వస్తున్న తాము నిరుద్యోగులుగా ఇటీవల దేశ వ్యాప్తంగా జరిపిన ఒక సర్వేలో ఆ విద్యార్థులు వాపోయారు.

రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 40 లక్షల మంది ఐటిఐ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ,  ‘నైపు ణ్యం, పునఃనైపుణ్యం, మరింత నైపుణ్యం అనేదే మీ మంత్రంగా ఉండాలి. గత ఎనిమిది సంవత్సరాల్లో ఐటీఐల్లో లక్షలాది సీట్లు పెంచాం, విద్యార్థులకు కొత్త ఉద్యోగావకాశాలు సృష్టించాం’ అన్నారు.

కానీ, వాస్తవం పూర్తి భిన్నంగా ఉంది. రెండేళ్లలో యువకులకు వృత్తి విద్య నేర్పిస్తే వారు పరిశ్రమలలో కార్మికులుగా ఉద్యోగాలు పొందుతారనీ, దానివల్ల ఒకవైపు పరిశ్రమలకు నిపుణులైన కార్మికుల కొరత తీరుతుందని, మరోవైపు బాగా చదువుకున్న యువతలో నిరుద్యోగ సమస్య తీరు తుందనే ఉద్దేశంతోనే ‘ఐటిఐ’లు నెలకొల్పారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో దాదాపు 15,000 ‘ఐటిఐ’లు ఉన్నాయి. పరిశ్రమలు నెలకొల్పినప్పుడు భూము లు కోల్పోయిన వారి పిల్లలకు శిక్షణ ఇచ్చి ఆయా పరిశ్రమల్లో నియమించడం కోసం 1950వ దశకంలో నెలకొల్పినవి వీటిలో అనేకం ఉన్నాయి. కానీ, ఈరోజు ‘ఐటిఐ’ చదివిన వారికి ఉద్యోగాలు వస్తాయన్న గ్యారెంటీ లేకపోవడంతో వాటిలో చేరడానికి అనేకమంది నిరాకరిస్తున్నారు.

‘ఐటీఐ’ లో ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ ట్రేడ్స్ ప్రధానమైనవి. కానీ, దేశవ్యాప్తంగా ఫిట్లర్ సీట్లు 71.5 శాతం, ఎలక్ట్రిషియన్ సీట్లు 64.8 శాతం ఖాళీగా ఉంటున్నాయని ‘నీతి ఆయోగ్ 2023’ నివేదిక తెలిపింది. మరోవైపు చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం కరువైంది. 

మూసివేత దిశగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు

బ్యాంకుల నుంచి రుణం పుట్టాలంటే డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. సిబిల్ రేటింగ్ ఉండాలి. బ్యాంక్ అధికారులతో సత్సంబంధాలు ఉండాలి. లిక్విడ్ షూరిటీ ఇవ్వాలి. దాదాపు 80 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. ప్రజాధనంతో లావాదేవీలు జరిపే ఈ బ్యాంకులు బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులతో బంధం ఉన్నవారికి లక్షలకోట్ల రూ॥ లు మాఫీ చేస్తాయి.

వాటిని వసూలు చేయలేక, కనీసం వారిని ప్రశ్నించడం కూడా చేతకాక పోవడంతో ఆ ప్రజాధనాన్ని ప్రభుత్వమే పనికట్టుకొని మాఫీ చేస్తున్నది. సామాన్యుల విషయంలో బ్యాంకులు ప్రవర్తించే తీరు మాత్రం దారుణంగా ఉంటున్నది.

రైతులు, కిరాణా వ్యా పారస్తులు, చిన్న పారిశ్రామిక వేత్తలు తాము చెల్లించాల్సిన వాయిదా  సక్రమం గా లేకపోతే విరుచుకుపడే బ్యాంకులు బడాబాబుల పారు బకాయిల విషయం లో ఎందుకు నోరు మెదపలేదు? ప్రతి రోజూ కనీసం 10 నుంచి 20 వరకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలను  మూసి వేత లేదా వేలం వేస్తున్న ప్రకటనలు పత్రికలలో వస్తాయి.

ఒక్క ఆంగ్ల దినపత్రికలోనే దక్షిణ భారత ఎడిషన్‌లో నెలకు వెయ్యికి పైగా పరిశ్రమలకు ఉరితాడు వేస్తున్నట్టు బ్యాంకుల ప్రకటనలు కనిపిస్తాయి. మొ త్తం ఆంగ్ల పత్రికల్లో ప్రకటనలు లెక్కిస్తే ఈ సంఖ్య 2000కి తక్కువేమీ కాదు.

కానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలకు తాము అందిస్తున్న సహకారం చాలా ఉందని, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్ ఫోటోలతో పూర్తిపేజీ ప్రకటనలతో అప్పుడప్పు డు దేశంలోని అన్ని భాషలలో గొప్పగా చెబుతుంటుంది.

ఈ పరిశ్రమలు తమ సమస్యల పరిష్కారానికి గొప్ప అవకాశం అంబుడ్స్‌మన్ అని, దీనిని వినియోగించుకోవాలని రిజర్వు బ్యాంకు తరపు ప్రకటన లు చెప్తుంటాయి. పై ప్రకటనలలో వాగాడంబరం తప్ప చిన్న పరిశ్రమలు నెలకొల్పే వారికి ప్రోత్సాహకాలు ఏమీ లేవని తేలుతున్నది.

నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఓ లెక్క ప్రకారం 60 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూసివేతకు గురైనట్టు సమాచారం. పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ కారణంగా ఈ సంఖ్య తీవ్రమైంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వీరికి ఒరిగిందేమీ లేదు. స్వయంకృషితో పదిమందికి ఉపాధి కల్పించేందుకు ముం దుకు వచ్చి పరిశ్రమలు స్థాపిస్తున్న వారికి ప్రోత్సాహం కరువవుతున్నది.

- డా. ముచ్చుకోట సురేష్‌బాబు