calender_icon.png 25 October, 2024 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంటిస్తామన్నా తీసుకోలే

29-07-2024 02:20:28 AM

  1. ఎన్నిసార్లు లేఖ రాసినా సర్కారు పట్టించుకోలే
  2. సింగరేణి విద్యుత్ వేరే రాష్ట్రాలకు పోతే మనకే నష్టం
  3. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాష్ర్ట ప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు రాష్ర్ట ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, అందులో భాగంగా రామగుండంలో 4 వేల మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మొదటి విడతగా 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 యూనిట్లను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటు లోకి తీసుకొచ్చినట్లు ఆదివారం ఓ ప్రకటనలో చెప్పారు. రూ.10,598.98 కోట్లతో చేపట్టిన ఈ రెండు పవర్ ప్రాజెక్టుల్లో మొదటి 800 మెగావాట్ల ప్లాంట్‌ను 3 అక్టోబర్ 2023నాడు, 800 మెగావాట్ల రెండో విద్యుత్ ప్లాంట్‌ను 4 మార్చి 2024నాడు ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారని గుర్తుచేశారు. ఈ 1600 మెగావాట్ల ప్రాజెక్టులో 85 శాతం విద్యుత్తును తెలంగాణ అవసరాలకే వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 2400 మెగావాట్ల ప్రాజెక్టు ను కూడా వీలైనంత త్వరగా ప్రారంభించుకుని.. రాష్ర్టంలో విద్యుత్ భద్రత కల్పించాలని కేంద్రం భావిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు గాను ఎన్టీపీసీతో రాష్ర్ట విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్ కో) కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీని తర్వాతే ప్లాంట్ల ఏర్పాటుకు, తగినంత బొగ్గు అందుబాటులో ఉంచుకోవడం మొదలైన అంశాలపై ఎన్టీపీసీ పని ప్రారంభిస్తుందని వివరించారు. 

నాలుగుసార్లు లేఖలు రాశాం

దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఎస్టీపీపీ ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యుదుత్పత్తి పెంచాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన అని కిషన్‌రెడ్డి తెలిపారు. దీనికి అనుగుణంగానే పీపీఏ విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని రాష్ర్ట ప్రభుత్వానికి నాలుగుసార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని అన్నారు. 5 అక్టోబర్, 2023, 9 జనవరి, 2024, 29 జనవరి, 2024, 29 ఏప్రిల్, 2024న లేఖలు రాస్తే ట్రాన్స్‌కో నుంచి కనీసం సమాధానం కూడా రాలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఎస్టీపీపీ ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఆసక్తి లేదన్నట్లుగానే భావించాల్సి వస్తుందని ఎన్టీపీసీ లేఖలో పేర్కొందని కిషన్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వానికి ఆసక్తి లేకుంటే దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విక్రయించేందు కు అనుమతి ఉంటుందని ఎన్టీపీసీ తన లేఖలో పేర్కొందని చెప్పారు. దేశవ్యాప్తంగా 250 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందని, తెలంగాణలో గరిష్ఠంగా 15.6 గిగావాట్ల డిమాండ్ ఏర్పడిందని వివరించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనాల మేరకు 2030 నాటికి రాష్ట్రంలో పీక్ పవర్ డిమాండ్ ఇప్పుడున్న దానికి రెట్టింపు కానుందని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పెరుగుతున్న పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు రెండోదశ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ (2400 మెగావాట్లు) ను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం అవసరని తెలిపారు.

రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై తొలి హక్కు తెలంగాణ ప్రజలదేనని, ఇందుకు కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తున్నా దీన్ని అందుకోవడంలో రాష్ర్ట ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమవుతోందని విమర్శించారు. ఇకనైనా రాష్ర్ట ప్రభుత్వం ఎన్టీపీసీ రాస్తున్న లేఖలపై స్పందించి పీపీఏ చేసుకుంటే అంది రాష్ర్ట ప్రజల ప్రయోజనాలను కాపాడినట్లు అవుతుందని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఆశిస్తున్నట్లు తెలిపారు.