గ్లోబల్ గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రన్
వ్యాధిపై అవగాహన పెంచుకోవాలన్న మంత్రి కోమటిరెడ్డి
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): అవగాహనతో మాత్రమే క్యాన్సర్ ను జయించవచ్చని రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. క్యాన్సర్ పై అవగాహన కోసం క్వాంబియంట్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ''రన్ ఫర్ గ్రేస్ - స్క్రీన్ ఫర్ లైఫ్ నినాదంతో గచ్చిబౌలి స్టేడియంలో గ్రేస్ రన్ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. క్యాన్సర్ మహమ్మారి దేశంలో లక్షలాది మంది జీవితాలనే చిన్నాభిన్నం చేస్తోందని,అవగాహనతో వ్యాధి కట్టడికి అందరూ కలిసి రావాలని ఈ రన్ లో పాల్గొన్న అందరికీ పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ సేకరిస్తుందని, తద్వారా వ్యాధి కట్టడికి కృషి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గ్రేస్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం రన్ లో పాల్గొన్న వారితో కలిసి మంత్రి కోమటిరెడ్డి స్టెప్పులు వేశారు. కార్యక్రమంలో గ్రౌస్ ఫౌండేషన్ ప్రతినిధులు చిన్నబాబు సుంకవల్లి తదితరులు పాల్గొన్నారు. రన్ లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేశారు.