25-02-2025 12:00:00 AM
జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జితేష్ వి.పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : ఈ నెల 27న జరిగే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎన్నికల నియమా నియమాలని పాటించాలని, అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, 48 గంటల నిశ్శబ్ద వ్యవధి (సైలెన్స్ పీరియడ్ )అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సోమవారం ప్రకటన లో తెలిపారు.
సైలెన్స్ పీరియడ్లో భాగంగా 25.02.2025 సాయంత్రం 4.00 గంటల నుండి 27.02.2025సాయంత్రం 4.00 గంటల వరకు బహిరంగ సభలు, ఊరేగింపులు సమావేశాలు నిర్వహించడం, ప్రచారం చేయడం, ఎలాంటి అభ్యంతకరమైన, రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ ఎస్ఎంఎస్ పంపడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించడం జరిగిందన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని సైలెన్స్ పిరియడ్ లో ఎవరు కూడా రాజకీయపరమైన ఎస్.ఎం.ఎస్ లు, బల్క్ ఎస్ఎంఎస్ లను పంపకూడదని, బహిరంగ సభలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించకూడదని, ప్రచారం చేయరాదని కలెక్టర్ సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
సైలెన్స్ పీరియడ్ లో నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే విచారణ జరిపి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, ఎన్నికల ప్రవర్తనా నియమావళి 1961 ప్రకారం జారీ చేయబడిన సూచనలు,ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో జిల్లాయేతర వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ఉండవద్దని స్పష్టం చేశారు. ఎఫ్ఎస్టి, ఎంసీసీ, టీం సభ్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికలు నిర్వహించే ఆయా జిల్లాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు .ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని, జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అట్టి ప్రకటన లో వెల్లడించారు.