26-02-2025 10:30:19 AM
మేడిపల్లిలో వారం రోజుల్లో 25 బోర్ల వైర్ చోరీ
సోమవారం రాత్రి అడ్డుకోబోయిన రైతుపై కత్తులతో దాడి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
చేవెళ్ల,(విజయక్రాంతి): మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామంలో కేబుల్ దొంగలు రెచ్చిపోయారు. వారం రోజుల్లోనే దాదాపు 25 బోరు మోటార్ల కేబుల్ దొంగిలించిన వీళ్లు.. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన రైతుపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాల్లోకి వెళ్తే... మేడిపల్లి గ్రామంలో వారం, పది రోజులుగా బోరు మోటార్లకు వాడే కేబుల్ చోరీకి గురవుతోంది. వారం కింద తాజా మాజీ సర్పంచ్తో పాటు పది మంది రైతులకు చెందిన బోర్లలోని వైరు, స్టార్టర్లలోని మీటర్లు దొంగిలించారు. మరుసటి రోజే మరో ఏడుగురు రైతుల బోర్లలోని వైరు మాయమైంది. బాధితులు పీఎస్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో నాలుగు రోజులు సైలెంట్ గా ఉన్న దొంగలు సోమవారం రాత్రి మళ్లీ రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన కే. రాజు, కొత్తపల్లి నరేందర్, ఎస్ అంతయ్య, పొద్దటూరి మల్లేశ్ పొలాల్లో ని నాలుగు బోర్లలో ఉన్న కేబుల్ వైరు, స్టార్టర్స్లో ఉన్న మీటర్లు దొంగతనం చేశారు. అక్కడి నుంచి అదే గ్రామానికి చెందిన మల్కాపురం ధనరాజ్ పొలానికి వచ్చిన దొంగలు అతనిపై కత్తులు, కర్రలతో దాడి చేశారు.
చోరీలు జరుగుతున్నాయనే పొలం వద్దకు..
మేడి పల్లి గ్రామానికి చెందిన ధనరాజ్ ఇటీవల చోరీలు జరుగుతుండడంతో రెగ్యులర్ గా పొలం వద్దకు వెళ్లి కాపలాగా పడుకుంటున్నాడు. సోమవారం రాత్రి కూడా భోజనం చేశాక... 10 గంటల సమయంలో భార్య సరిత, కొడుకు జగదీశ్ ను కూడా తీసుకొని పొలం వద్దకు వెళ్లి అక్కడే ఉన్న గుడిసెలో పడుకున్నాడు. 11 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు మాస్కులు వేసుకొని అక్కడికి వచ్చారు. అలికిడికి నిద్ర లేచిన సరిత ఎవరని అడగగా... చప్పుడు చేయకని వాళ్లు బెదిరించారు. దీంతో భర్త ధనరాజ్ ను నిద్రలేపగా వారిని బెదిరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మరో ఇద్దరిని తీసుకొని వచ్చి పైపులు, కత్తులు, కర్రలతో ధనరాజ్ పై దాడి చేశారు. భార్య, కొడుకు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని తోసేసి ధనరాజ్ గొంతు, చెవి కోసి పారిపోయారు. కొడుకు జగదీశ్ వెంటనే ఫోన్ ద్వారా గ్రామస్తులకు సమాచారం ఇచ్చి వారి సాయంతో హైదరాబాద్లోని ప్రీమియర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మంగళవారం భార్య సరిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈమెతో కేబుల్ దొంగల బాధితులైన కే.రాజు, కొత్తపల్లి నరేందర్, ఎస్ అంతయ్య, పొద్దటూరి మల్లేశ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితులను పట్టుకుంటాం : సీఐ పవన్ కుమార్ రెడ్డి
సమాచారం అందుకున్న మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చెరుకొని విచారణ చేపట్టారు. అక్కడికి డాగ్ స్క్వాడ్ ను పిలిపించి... ఆధారాలు సేకరించారు. చోరీల విషయమై గ్రామస్తులను ఆరా తీయగా.. బోర్లలో దొంగిలించిన వైరును కాల్చి అందులో జింక్ వైర్ ను అమ్ముకుంటున్నట్లు ఉన్నారని, ఓ రైతుకు చెందిన పొలంలోనే కాల్చారని.. ఆ ఆనవాళ్లు చూపించారు. పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయంగా ఉందని, వెంటనే దొంగలను పట్టుకోవాలని కోరారు. ఓ వ్యక్తి ఫ్యాషన్ ప్రో బైక్ పై పొలాల వద్ద తిరుగుతూ కనిపించాడని.. ఎవరని అడిగినా స్పందించలేదని కొందరు రైతులు చెప్పారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ హామీ ఇచ్చారు. కాగా, వారం కింద చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామంలో ఉన్న మొయినాబాద్ మండలం నజీబ్ నగర్ కు చెందిన నిమ్మతోటలో బోరు మోటారు, కేబుల్ కూడా దొంగలు ఎత్తుకెళ్లారు.