16-03-2025 12:43:37 AM
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, మార్చి -15 (విజయక్రాంతి):- ట్రాఫిక్ఫ్రీ నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మం కాల్వొ డ్డులోని మున్నేరు నదిపై నిర్మిస్తున్న తీగల వంతెన నిర్మాణ పనులను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో కలిసి పరిశీలించారు. కేబుల్ బ్రిడ్జి పనులను రెండు వైపుల నుంచి సమాంతరంగా చేపట్టాలని, జూన్ లోపు ఎరక్షన్ పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
ఖమ్మం పట్టణానికి మణిహారంగా ఉండే విధంగా హైదరాబాద్లోని దుర్గం చెరువు వద్ద ఉన్న మోడల్ లాగా మున్నేరుపై కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని అన్నారు. రూ.180 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నట్టు తెలిపారు. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం భూ సేకరణ, చిన్న, చిన్న వ్యాపారులకు అవసరమైన సహకారం ప్రభుత్వ నుంచి అందించేందుకు కలెక్టర్ అధ్యక్షతన ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
బ్రిడ్జ్ నిర్మాణంలో ఎటువంటి ఆస్తి కోల్పోయిన జీవనోపాధి కోల్పోకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆగస్టు 15 నాటికి ఖమ్మం మీదుగా రాజమండ్రి గ్రీన్ ఫీల్ హైవే పూర్తవుతుందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఎస్ఈ హేమలత, ఈఈ యుగేందర్, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ రవికుమార్, ఆర్ అండ్ బీ డీఈ చంద్రశేఖర్, జేఈ విశ్వనాథ్, విద్యుత్ శాఖ ఏఈ క్రాంతి సిన్హా పాల్గొన్నారు.