భారీ వర్షాల నష్టం, కేంద్ర సాయంపై చర్చ
- మూడు యూనివర్సిటీలకు పెట్టిన పేర్లకు ఆమోదం
- హైడ్రా, రేషన్కార్డులు, వ్యవసాయ రుణాలపై చర్చ?
హైదరాబాద్, సెప్టెంబర్ 19 ( విజయక్రాంతి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో వ్యవసాయ రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, కుల గణన, రేషన్కార్డులు, వరద నష్టానికి సంబంధించిన అంశాలతో పాటు హైడ్రాకు చట్టబద్దత కల్పించే ఆర్డినెన్స్కు జారీకి ఆమోదం తెలపనుంది.
దీంతో పాటు వివిధ అంశాలపైన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోకున్నట్లు చెబుతున్నారు. చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటీ వరకు 99 జీవో ద్వారా మాత్రమే కొనసాగుతోంది. ఈ సంస్థ ఎఫ్టీఎల్లో ఉన్న అక్రమణలను తొలగిస్తుంటే కొందరు అడ్డుకుని హైడ్రాకు కూల్చివేతల అధికారం లేదంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్దత కల్పించే అర్డినెన్స్పై అంశంపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోనున్నది.
యూనివర్సిటీల పేర్ల మార్పు..
కాగా మూడు యూనివర్సిటీలకు ముగ్గురు ప్రముఖల పేర్లను ప్రభుత్వం పెట్టింది. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ, తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్రెడ్డి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టారు. వీటిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదించనున్నారు. వీటితో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు పెండింగ్ డీఏలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రుణమాఫీ, పంటల బీమా, రైతు భరోసా..
ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షల వరకు పంట రుణమాఫీని చేపట్టింది. రూ. 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న రుణాలు ఇంకా మాఫీ కాలేదు, దీంతో వారికి దశల వారీగా రుణాలు మాఫీ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రూ. లక్షల కంటే ఎక్కువగా ఉంటే ఆ ఎక్కువ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించిన రైతులకు వెంటనే రూ. 2 లక్షలను ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేస్తోందని సీఎంతో పాటు మంత్రులు కూడా చెబుతున్నారు. దీనిపై క్యాబినెట్లో ఆమోదించి రైతులకు మరింత క్లారిటీ ఇవ్వనున్నారు.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు స్థానంలో పంటల పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన అమలు, పరిమితులపై జిల్లాల వారీగా అభిప్రాయాలు కూడా సేకరించారు. ప్రస్తుతం వానాకాలం పంట ముగింపు దశకు చేరుతున్నందున ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. దీనిపైనా మంత్రివర్గ సమావేశం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా పథకాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
కులగణన, రేషన్కార్డుల జారీపై చర్చ..
రాష్ట్రంలో కులగణనను మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకు నిధులు కూడా కేటాయించడంతో పాటు బీసీ కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది. ఈ మేరకు కులగణనకు సంబంధించిన సర్వే మార్గదర్శకాలను క్యాబినెట్ భేటీలో ఆమోదించే అవకాశం ఉంది. పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారీలో పారదర్శకతను పెంచడానికి ఇప్పటివరకున్న అర్హతలను సవరించాలనే ప్రతిపాదనపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోకున్నారు. రేషన్కార్డులతో సంబంధం లేకుండానే సాధారణ ప్రజలకు ఆరోగ్య శ్రీ సేవలను సులభంగా అందించడానికి ఆరోగ్య కార్డుల జారీకి ఆమోదం తెలపనుంది.
వరదలపై కేంద్ర సాయానికి వినతి..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని నగరాలు, పట్టణాలు. గ్రామాల్లో ప్రజలు ముంపుతో భారీగా నష్టపోయారు. ఇళ్లు, రోడ్లు, వృక్షాలు, పశువులు, పక్షులతో పాటు మనుషులు కూడా మరణించారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ. 10 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు కేంద్ర బృందం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని చూసింది. దీనిపై కేంద్రం సాయం చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని క్యాబినెట్ సమావేశంలో తీర్మాణం చేయనున్నారు.