calender_icon.png 15 October, 2024 | 1:56 PM

Breaking News

గోల్డ్ బాండ్లు కొంటారా? అమ్ముతారా?

18-08-2024 12:00:00 AM

ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో ప్రీమియం ధరతో ట్రేడవుతున్న బాండ్లు

సావరిన్ గోల్డ్ బాండ్లను (ఎస్‌జీబీలు) రిజర్వ్‌బ్యాంక్ జారీచేసిన సమయంలోనే వాటిలో పెట్టుబడికి అవకాశం ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. అలాగే వాటిలో పెట్టుబడి చేసిన తర్వాత బాండ్ల కాలపరిమితి ముగిసేంతవరకూ అట్టిపెట్టుకోవాల్సిందేనన్న ఉద్దేశ్యంతో వాటి జోలికి వెళ్లరు. అలాగే ఆర్బీఐ జారీచేసిన సమయంలో పెట్టుబడి చేసే అవకాశాన్ని మిస్ అయినవారు తదుపరి ఎస్‌జీబీ సిరీస్ కోసం వేచిచూస్తుంటారు. బాండ్లు తమ చెంత ఉండి డబ్బు అత్యవసరం ఉన్నవారు తనఖాలను (ఎస్‌జీబీలను బ్యాంక్‌ల్లో తనఖా చేసుకునే అవకాశం ఉంది) ఆశ్రయిస్తుంటారు.

కానీ వాటిని స్టాక్ ఎక్సేంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లోనే డీమ్యాట్ ఖాతాల ద్వారా కొనవచ్చు. లేదా అమ్మవచ్చు. పైగా ప్రస్తుతం అమ్మేవారికి గ్రాము బంగారం ఇండియన్ బులియన్ అండ్ జ్యువలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) రిఫరెన్స్ రేటుతో పోలిస్తే  ప్రీమియం ధరలు లభిస్తున్నాయి. నేవారికి మాత్రం స్పాట్ బంగారం ధరకంటే ఎక్కువ చెల్లించాల్సిందే. 

కొత్త బాండ్ల జారీ అవకాశాలు తక్కువ

ఈ ఏడాది జూలై 23నాటి కేంద్ర బడ్జెట్లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో ఎస్‌జీబీలపై పలువురి దృష్టి మళ్లింది. సుంకం కోతతో మార్కెట్లో బంగారం ధరతో పాటు ఎస్‌జీబీల ధరలు సైతం భారీగా తగ్గాయి. రానున్న నెలల్లో మెచ్యూర్ అయ్యే ఎస్‌జీబీల్లో పెట్టుబడి చేసిన ఇన్వెస్టర్లలో తమ రాబడి తగ్గుతుందన్న ఆందోళనలూ నెలకొన్నాయి.

గత మూడు, నాలుగేండ్లుగా బంగారం ధర భారీగా పెరిగినందున ఎస్‌జీబీల రాబడులు అధికంగా ఉంటున్నాయని, మెచ్యూర్ అయ్యే బాండ్లకు ఎక్కువ చెల్లించాల్సి వస్తున్నదన్న కారణంగా బంగారం దిగుమతి సుంకాల్ని తగ్గించారన్న వూహాగానాలు మార్కెట్లో ఉన్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని చెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఎస్‌సీబీల జారీ పట్ల అనిశ్చితి ఏర్పడటంతో బంగారం ధర పెరుగుదల ద్వారా లబ్దిపొందేందుకు సెకండరీ మార్కెట్లో ఎస్‌జీబీలు ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారా యని జసాని వివరించారు. అందుచేత చురుగ్గా ట్రేడయ్యే ఎస్‌జీబీలకు ప్రీమియం ధరను చెల్లిస్తున్నారని అన్నారు. 

ప్రీమియం ధర ఎందుకు?

2015 నుంచి ఇప్పటివరకూ 67 విడతలుగా ఆర్బీఐ ఈ గోల్డ్ బాండ్లను జారీచేసింది. 14.7 కోట్ల యూనిట్లు జారీ అయ్యాయి. ఈ సిరీస్‌లన్నీ సెకండరీ మార్కెట్లలో లిస్టయ్యాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో ట్రేడింగ్‌కు అం దుబాటులో ఉన్నాయి. రిజర్వ్‌బ్యాంక్ గోల్డ్ బాండ్లను జారీచేసినపుడు లేదా వాటి కాలపరిమితి ముగిసిన తర్వాత మదుపుదారులకు చెల్లించడానికి ధరను ఇండియన్ బులియన్ అండ్ జ్యువలర్స్ అసోసియేషన్  ప్రకటించే  15 రోజుల సగటు పుత్తడి ధర ఆధారంగా (రిఫరెన్స్ ధర) నిర్ణయిస్తుంది. అందుచేత స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ఈ రిఫరెన్స్ ధరకు అనుగుణంగానే ఎస్‌జీబీలు ట్రేడవుతుంటాయి.

కానీ ఇటీవలకాలంలో గోల్డ్ బాండ్లు రిఫరెన్స్ రేటుకంటే 8 నుంచి 15 శాతం వరకూ ప్రీమియంతో ఎక్సేజీల్లో చేతులు మారుతున్నాయి. ఇటీవల కొత్తగా బాండ్లు జారీకాకపోవడం, రానున్న రోజుల్లో కొత్త సిరీస్ గోల్డ్ బాండ్లు విడుదల కాకపోవచ్చన్న అంచనాలతో సెకం డరీ మార్కెట్లో వీటికి డిమాండ్ పెరుగుతున్నది. దీంతో రిఫరెన్స్ ధరకంటే ఈ బాం డ్ల ధర మరింత పెరిగిపోతున్నది. ఉదాహరణకు మార్కెట్లో చురుగ్గా ట్రేడయ్యే ఎస్‌జీబీ 2023 సిరీస్ ధర ఎన్‌ఎస్‌ఈలో ఆగస్టు 14నాటికి ముగింపు ధర రూ.7,930గా ఉన్నది. అదే రోజున ఐబీజేఏ 999 స్వచ్ఛతగల బంగారం ధర రూ.7,092కాగా, దానికి 12 శాతం ప్రీమియంతో ఆ బాండు ధర పలికింది. భౌతిక బంగారం, గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)కు లేని పన్ను మినహాయింపు ప్రయోజనం ఎస్‌జీబీలకు లభిం చడం సైతం వీటికి డిమాండ్‌ను పెంచుతున్నదని విశ్లేషకులు చెపుతున్నారు. 

ఏమిటీ ఎస్‌జీబీలు

కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో ఆర్బీఐ ఎస్‌జీబీలను జారీచేస్తుంది. ఇతర బంగారం ఆస్తులైన గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు), భౌతిక బంగారంలో మదుపు చేస్తే వాటి ధర పెరుగుదల ద్వారా వచ్చేదే ప్రతిఫలం. కానీ ఎస్‌జీబీల్లో పెట్టుబడి చేసినవారికి బంగారం ధర పెరుగుదలతో లభించే ప్రయోజనంతో పాటు ఆయా సిరీస్ బాండ్లకు అనుగుణంగా 2.5 శాతం లేదా 2.75 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. 

పన్ను మినహాయింపు అదనపు ప్రయోజనం

గోల్డ్ ఈటీఎఫ్‌లు, భౌతిక బంగారంకు లేని పన్ను ప్రయోజనాలు ఎస్‌జీబీలకు లభిస్తున్నాయి. ఈ బాండ్ల కాలపరిమితి 8 ఏండ్లుకాగా, మెచ్యూరిటీ తర్వాత పొందే సొమ్ముపై మూలధన లాభాల పన్న మినహాయింపు ఉన్నది. అలాగే ఎస్‌జీబీలను 5, 6, 7 ఏండ్లు ముగిసిన తర్వాత ఆర్బీఐ ఇచ్చే ముందస్తు విత్‌డ్రాయిల్ సదుపాయం ద్వారా పొందే డబ్బుకు కూడా మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు ఉన్నది. కానీ ఆర్బీఐ విండో ద్వారా కాకుండా స్టాక్ ఎక్సేంజ్‌ల్లో విక్రయిస్తే వచ్చే మూలధన లాభాలపై పన్ను కట్టాల్సిందే. స్టాక్ ఎక్సేంజ్‌లో కొని, 12 నెలలలోపు విక్రయిస్తే స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్‌గా పరిగణిస్తారు. దానికి వ్యక్తిగత శ్లాబ్ రేట్ల ప్రకారం పన్ను చెల్లించాలి. ఎస్‌జీబీలను 12 నెలల తర్వాత ఎక్సేంజీల్లో విక్రయిస్తే 12.5 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. 

లిక్విడిటీ చూడండి

ఎక్సేంజీల్లో ఎస్‌జీబీలను కొనాలనుకునే ఇన్వెస్టర్లకు వాటి లిక్విడిటీ లేదా ట్రేడింగ్ పరిమాణం కీలకం. పలు సిరీస్‌ల ఎస్‌జీబీల్లో లిక్విడిటీ తక్కువ. దానితో కొనుగోలు, అమ్మకం ధరలు తగిన శ్రేణిలో ఉండవు. రిఫరెన్స్ రేటు కంటే ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక లిక్విడిటీ కలిగిన బాండ్లు తగిన ధరకు లభిస్తాయి. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో అన్ని ఎస్‌జీబీల మూడు నెలల సగటు ట్రేడింగ్ పరిమాణం విలువ రూ.13.4 కోట్లు ఉన్నది.