దౌల్తాబాద్, జూలై 28: ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. రాయపోల్ మండల కేంద్రంలో కోల నర్సవ్వ అనే వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటోంది. నర్సవ్వ శనివారం రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని దొంగలు ఆమె ఇంటికి వచ్చి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పడకగది తలుపులు పగులగొట్టి ఆమెపై దాడి చేసి 3.5 తులాల బంగారు నగలు, 20 తులాల వెండి పట్టగొలుసులు లాక్కొని పరారయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.