- ఆయన ఇంట్లో పనిచేసే వ్యక్తిపై అనుమానం!
- బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన డిప్యూటీ సీఎం పీఏ
- పశ్చిమబెంగాల్లో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం కలకలం రేపింది. భట్టి విదేశీ పర్యటనలో ఉన్నక్రమంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని బీఎన్రెడ్డి కాలనీలో ఉన్న ఆయన నివాసంలో బీహార్కు చెందిన ఇద్దరు దొంగలు భట్టి ఇంటికి కన్నం వేశారు. తాళం పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు.
దొంగలను పశ్చిమబెం గాల్లో ఖరగ్పూర్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. నిందితులకు సం బంధించిన వివరాలను జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ వెల్లడించారు. ఖరగ్పూర్ రైల్వేస్టేషన్ ఏడో నెంబర్ ఫ్లాట్ఫామ్ వద్ద జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.
ఈ క్రమంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులు బీహార్కు చెందిన రోషన్కుమార్ మండల్, ఉదయ్కుమార్ ఠాకూర్లుగా పోలీసులు గుర్తించారు. వారి నుంచి రూ. 2.2 లక్షల నగదు, 100 గ్రాముల బంగారు నాణెం, విదేశీ కరెన్సీ నోట్లు, పెద్దమొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పశ్చిమబెంగాల్ పోలీసులు తెలిపారు.
ఈ విషయమై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. నిందితులను ఖరగ్పూర్ కోర్టులో హాజరుపరిచి, అనంతరం విచారణ నిమిత్తం తెలం గాణకు తరలించే అవకాశముంది. అయితే పట్టుబడిన నిందితుల్లో రోషన్కుమార్ మండల్ అనే వ్యక్తి భట్టి విక్రమార్క ఇంట్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
చోరీ జరిగినప్పటి నుంచి రోషన్ కనిపించకపో వడంతో అతడిపై అనుమానం వ్య క్తం చేస్తూ భట్టి విక్రమార్క పీఏ గురువారం బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని పశ్చిమబెంగాల్కు పంపినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.