27-04-2025 12:49:42 AM
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): పదేళ్ల పాలనలో ప్రజల హక్కులను అన్ని రకాలుగా హరించిన బీఆర్ఎస్కు తమ నాయకులను విమర్శించే అర్హత లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. హెచ్ఐసీసీ నోవాటెల్లో జరుగు తున్న అంతర్జాతీయ రాజకీయ సదస్సు ‘భారత్ సమ్మిట్ న్యాయపథ్ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక చిత్రప్రదర్శనను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈసందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ..ఇతర దేశాలతో భారత్కున్న సత్సంబంధాలు, చారిత్రక ఘటనలను నేటితరానికి తెలియజేయాలనే సంకల్పంతోనే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ ప్రగతిశీల ఉద్యమానికి మార్గనిర్దేశం చేసేలా ఈ సదస్సును నిర్వహించామన్నారు. ప్రగతిశీల ఆలోచనలు, ప్రజాస్వామ్యం, ప్రపంచశాంతి తదితర అంశాల్లో పనిచేసే 100 దేశాలకు చెందిన మేధావులను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేశామన్నారు.
మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మార్గనిర్దేశంలో రాజ్యాంగస్ఫూర్తిని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఏఐ సాయంతో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నామని ఆరోపించారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఫొటోలను రెండురోజుల ముందే సోషల్ మీడియాలో విడుదల చేయడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు.