అసెంబ్లీలో సభ్యులు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరుకావాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించి ంది. బడ్జెట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సెషన్లో బీఆర్ఎస్ సభ్యులు ప్రధానంగా నిరుద్యోగులకు కాంగ్రెస్ హామీలు, జాబ్ క్యాలెండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్థులపై ప్రభుత్వ దమనకాండను నిలదీయనున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యాలు, చేనేత ఆత్మహత్యలపై ప్రశ్నిద్దామని సమాయత్తం అవుతున్నారు. ఆరు గ్యారెంటీల అమలు, శాసనసభలో చట్టబద్ధత, రుణమాఫీ అమలులో ఆంక్షలపై ఒత్తిడి చేయాలని భావిస్తున్నారు. మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపులో వైఫల్యం, రైతుభరోసా చెల్లింపులో జాప్యం, గ్రామాలు, పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రశ్నించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.