పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, నాలాలపై అక్రమ నిర్మాణాలు, మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ వైఖరేంటో స్పష్టం చేయాలని పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్ డిమాండ్ చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే హైడ్రాపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని సోమవారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని గతంలోనే సుప్రీంతీర్పులు ఉన్నాయని, దానిపై ఎవరు మాట్లాడిన కోర్టు ధిక్కరణ కింద సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఏపీలో బిల్డింగ్ రూల్స్ ప్రకారం ఎఫ్టీఎల్, బఫర్ జోన్, రోడ్డు విస్తరణలో ప్రజా ప్రయోజనాల కోసం విధి విధానాలు ఖరారు చేస్తూ జీఓ 168ని విడుదల చేసిందని, ఈ జీఓ మేరకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఎవరిదైనా పట్టా భూమి ఉన్నా ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని నిబంధనలు చెబుతున్నాయని తెలిపారు.