calender_icon.png 13 March, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో అవే అబద్దాలు, బయటా అవే అబద్ధాలు: హరీశ్ రావు

13-03-2025 02:51:07 PM

హైదరాబాద్: అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అసెంబ్లీలో అవే అబద్దాలు, బయటా అవే అబద్దాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Siddipet MLA Thanneeru Harish Rao) మండిపడ్డారు. 13 రోజులు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖలోని టీవీవీపీ విభాగంలో ఉన్న 13వేల మందికి జీతాలు చెల్లించనిది వాస్తవం కాదా?, డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నది మీ కళ్లకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

ఆరోగ్య శాఖలోనే కాదు, పోలీసు శాఖలోనూ ఇదే దుస్థితి ఉందన్నారు. పెంచిన జీతాలు, అలవెన్సుల మాట దేవుడెరుగు, ఉన్న జీతాలు ఇప్పటికీ రాక హోం గార్డులు ఆవేదన చెందుతున్నది నిజం కాదా? అన్నారు. ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామనే అబద్దాన్ని, అవకాశం ఉన్న చోటల్లా ప్రచారం చేసుకునే మీకు.. వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల ఆవేదన అర్థం కావడం లేదా?, దుష్ర్పచారంతోనే ఏడాదిన్నర గడిపారు. ఇంకెంత కాలం వెళ్లదీస్తారు.? అని హరీశ్ రావు ప్రశ్నించారు. టీవీవీపీ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సహా, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోం గార్డులకు వెంటనే వేతనాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు స్పష్టం చేశారు.