18-03-2025 09:24:21 PM
పొద్దున బీజేపీ .. సాయంత్రం మధుయాష్కీతో మంతనాలు..
నర్సింహ రెడ్డి, మధుసూదన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలి..?
బీఆర్ఎస్ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి...
ఎల్బీనగర్: మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మారెడ్డి అవినీతి, రాజకీయ భాగోతం త్వరలోనే ఆధారాలతో బయట పెడతామని బీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ నాయకుడు జక్కిడి రఘువీర్రెడ్డి హెచ్చరించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి శంకుస్థాపనలు చేసిన అభివృద్ధి పనులకు తిరిగి కొబ్బరి కాయలు కొడుతున్న కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ కార్యకర్తలను గంజాయి బ్యాచ్లంటూ విమర్శించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్సురాబాద్ డివిజన్ సెంట్రల్ బ్యాంక్ కాలనీలోని ఆయన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. గంజాయి బ్యాచులు, బ్రోతల్ హౌస్ నిర్వాహకులు, క్యాసినో ఆట నిర్వాహకులంతా కొప్పుల నర్సింహారెడ్డి ప్రధాన అనుచరులేనని మరువొద్దని హితవు పలికారు.
మన్సూరాబాద్ డివిజన్లో కొత్త ఇండ్లు కట్టేందుకు ఇటుక, ఇసుక పడితే చాలు గద్దల్లా వాలిపోయే ఆయన పీఏల భాగోతం అందరికీ తెలిసిందే అన్నారు. ఆయన కొప్పుల నర్సింహారెడ్డి కాదని కుటిల రాజకీయాలు చేసే కుటిల నర్సింహ్మారెడ్డి అని విమర్శించారు. పొద్దున బీజేపీ కండువా వేసుకొని తిరిగే నర్సింహారెడ్డి సాయంత్రం అయితే కాంగ్రెస్ పార్టీ నేత మధుయాష్కీ గౌడ్ తో మంతనాలు సాగిస్తున్నది ప్రజలు గమనిస్తున్నారన్నారు. అసలు సిసలైన బీజేపీ కార్యకర్తలు ఆయ కింద పనిచేయాలంటే బాధపడుతున్నారన్నారు. కొప్పుల డబుల్ రిజిస్ట్రేషన్లకు బ్రాండ్అంబాసిడర్గా ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ను తాను అక్కగా భావిస్తానని, ఆమె అంటే ఎంతో గౌరవం ఉందని, సుధీర్రెడ్డి వ్యక్తిగతంగా విమర్శించలేదని ఈ సందర్భంగా రఘువీర్ అన్నారు.
నియోజకవర్గంలో టూరిస్ట్ పొలిటీషియన్ మధుయాష్కీ గౌడ్ ఆధ్వర్యంలో కుటిల నర్సింహ్మారెడ్డి, చంపాపేటలో చెల్లని కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్లో చేరేందుకు రంగం చేసుకునే నియోజకవర్గంలో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. చిన్న చెరువు తాము కబ్జా చేశామని మధుయాష్కీ ఆరోపణలు చేశాడని.. ఈ విషయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని, సర్వే నెంబర్ 93తో పాటు, డివిజన్లోని చిన్న చెరువు పరిసరాల్లోని భూములపైన సర్వే చేయించాలని రఘువీర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సతీశ్ కుమార్, అఖిల్, రామాచారి, లింగం, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.