26-03-2025 12:30:47 AM
మహబూబ్ నగర్ మార్చి 25 (విజయ క్రాంతి) : విద్యావ్యవస్థను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం కారణంగానే నిర్వీర్యం కావడం జరిగిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశంలో బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విద్యావ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా మంది విద్యకు దూరంగా ఉంటున్నారని చెప్పడం జరిగిందని, ఇది నిజమే అయినప్పటికీ గత ప్రభుత్వ పాపమే అని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు.
అడ్డాకల్ మండల సమీపంలో ఓ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులు టాయిలెట్లు లేక రోడ్డుపై వచ్చి నిరసన తెలిపిన రోజులు ఉన్నాయని, ఇది గత ప్రభుత్వ పాపం కాదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ముందు ఆలోచనతో వాస్తవాలను ముందు ఉంచుతూ ఆదర్శ పాఠశాలల పేరుతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే 11067 టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని, 21 వేల మంది టీచర్లను స్థానచలంతో పాటు పదోన్నతులు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు, ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేశారు.