కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డి
రాజన్న సిరిసిల్ల, జూలై 21(విజయక్రాంతి): బీఆర్ఎస్ నేతలకు రుణమాఫీపై మాట్లాడే కనీస అర్హత లేదని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇదివరకు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని.. వారి ఆటలు సాగవన్నారు. సిరిసిల్ల ప్రజా సమస్యలపై పోరాడాల్సిన కేటీఆర్ ఇంట్లో కూర్చుని లేఖలు రాస్తున్నాడని, సోషల్ మీడియా వేదికగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.