01-03-2025 12:00:00 AM
ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేట ఫిబ్రవరి 28 : శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్లో జరిగిన ప్రమాదంపై బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసం ఓవరాక్షన్ చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలను ఆయన స్వయంగా పరిశీలించి జెపి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో ఉద్యోగులు మృతి చెందిన ఘటనలో ప్రతిపక్ష నేతలను ఎక్కడికక్కడ నిర్బందించారని ఆ కుటుంబాలను కూడా ప్రభుత్వం పరామర్శించిన దాఖలాలు లేవన్నారు.
గత పదేళ్ల కెసిఆర్ ప్రభుత్వంలో డిక్టేటర్ నిరంకుశత్వంగా ప్రభుత్వం నడిచిందని ప్రస్తుతం ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో డెమోక్రటిక్ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం నడుస్తోందని ఇందులో భాగంగానే ప్రతిపక్ష నేతలను సైతం ప్రాజెక్టు సందర్శనకు అనుమతించిన విషయం గుర్తు చేశారు. అయినా గత అనుభవం అంటూ చెప్పుకునే రాష్ర్ట మాజీ మంత్రి హరీష్ రావు కార్మికులను కాపాడేందుకు కనీసం అవసరమయ్యే పనికొచ్చే సలహాలివ్వకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్బిసి ప్రమాదం జరిగిందని ఆరోపించారు. కొండగట్టు అంజన్న బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోయారని, కనీసం కేసీఆర్ అటు వైపు కన్నెత్తి చూడలేదన్న విషయాన్ని గుర్తు చేవారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఎనిమిది మందిని రక్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ నేతలు జరిగిన ప్రమాద సంఘటనపై రాజకీయం మానుకొని సలహాలు సూచనలు ఇవ్వాలి ... ప్రమాదంపై అనవసర ఆరోపణలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హేచ్చరించారు.