03-05-2024 01:33:45 AM
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్తో బస్భవన్లో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బస్సులు, భవిష్యత్లో వాడకంలోకి వచ్చే ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా ఆయనకు వివరించారు. పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులు వినియోగిస్తున్న టీఎస్ఆర్టీసీకి గారెత్ అభినందనలు తెలిపారు. గత ఏడాది జరిగిన జీ 20 సమావేశంలో యూకే, యూఎస్తో భారతదేశానికి కుదిరిన ఒప్పందం మేరకు జెడ్ఈవీల ఫైనాన్సింగ్ మెకానిజాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై టీఎస్ఆర్టీసీ వర్క్షాప్లు నిర్వహించి సిబ్బందికి అవగాహన కల్పిస్తామన్నారు. కాలుష్యరహిత ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెడుతున్నామని సజ్జనార్ వారికి వివరించారు. సంస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వ్యవస్థను మరింత విస్తృత పరిచేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశంలో బ్రిటిష్ హైకమిషనర్ సీనియర్ అడ్వైజర్ జావైద్ మల్లా, తెలంగాణ ప్రభుత్వ ఆటోమోటివ్, ఈవీ సెక్టార్ డైరెక్టర్ గోపాలకృష్ణ, టీఎస్ఆర్టీసీ సీఓఓ డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, డబ్ల్యూఆర్ఐ ఇండియా ప్రతినిధి చైతన్య తదితరులు పాల్గొన్నారు.