11-04-2025 12:12:15 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
అర్మూర్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా అర్మూర్ డివిజన్ పరిధిలోని ఆర్మూర్ మండలం మంథని, జక్రాన్పల్లి మండలం కేశ్ పల్లి, మోర్తాడ్ మండల కేంద్రంలో ఐకెపి మహిళా సంఘాలు, సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు.
రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. ధాన్యం తూకంలో ఏమైనా తేడాలు ఉంటున్నాయా అని ప్రశ్నించగా, ఒక్కో బస్తాకు 41.5 కిలోల చొప్పున తూకం జరుపుతున్నారని రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిలువ చేసిన ధాన్యం రాశులను సందర్శించి వాటి నాణ్యతను పరిశీలించారు. గ్రెయిన్ క్యాలిపర్ ద్వారా నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా సన్న ధాన్యం ఉందా లేదా అని కలెక్టర్ స్వయంగా పరిశీలన జరిపారు. మంథని గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో తూకం వేస్తున్న ధాన్యం అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యాన్ని తరలించి ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర పొందాలని, సన్న ధాన్యానికి అదనంగా క్వింటాలుకు 500 రూపాయలు చొప్పున బోనస్ చెల్లించడం జరుగుతోందని గుర్తు చేశారు. కలెక్టర్ వెంట ఇంచార్జ్ డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజాగౌడ్, డీసీఓ ఎన్.శ్రీనివాస్ రావు, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.