calender_icon.png 10 October, 2024 | 5:50 AM

నా భార్య లంచగొండి!

10-10-2024 02:00:41 AM

రోజూ లక్షలు తెస్తోంది 

కాంట్రాక్టర్ల నుంచి భారీగా వసూళ్లు చేస్తోంది.. మా ఇంట్లో అన్నీ నోట్ల కట్టలే

మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి భర్త శ్రీపాద సంచలన ఆరోపణలు

ఇంట్లో ఉన్న కరెన్సీ కట్టలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్

రాజేంద్రనగర్, అక్టోబర్ 9: ‘నా భార్య భారీగా అవినీతికి పాల్పడుతోంది.. ప్రతిరోజూ నోట్ల కట్టలతో ఇంటికి వస్తోంది.. కోట్ల రూపాయలు తన సోదరులకు ఇచ్చింది’ అని మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి భర్త శ్రీపాద సంచలన ఆరోపణలు చేశారు.

అంతేకాకుండా ఆయన తన ఇంట్లో ఉన్న సుమారు రూ.80 లక్షలకు సం బంధించి నోట్ల కట్టలను వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో అది బుధవారం వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆమె సుమారు రెండేళ్ల పాటు పనిచేసిన మణికొండలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

ప్రణాళిక ప్రకారం బదిలీ..

మణికొండ మున్సిపాలిటీలో ఆమె చేసిన అవినీతిపై అధికారులతో పాటు నేతలు, ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. కాంట్రాక్టర్లను పట్టి పీడించేదని, అందిన కాడికి వసూలు చేసేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెపై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం దివ్యజ్యోతి సుమారు 10 రోజుల క్రితం ఇక్కడి నుంచి బదిలీపై జీహెచ్‌ఎంసీకి వెళ్లింది. 

భార్య వ్యవహార శైలిపై శ్రీపాద వీడియోలో పలు అంశాలు వెల్లడించారు. తన భార్య దివ్యజ్యోతి భారీగా అవినీతికి పాల్పడటంతో తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించినట్లు తెలిపారు. అయినా ఆమె వ్యవహారశైలి ఏ మాత్రం మారలేదని, దీంతో విసుగు చెంది తమ ఇంట్లో వివిధ ప్రదేశాల్లో భార్య గుట్టుగా దాచి ఉంచిన సుమారు రూ.80 లక్షలకు సంబంధించిన నోట్ల కట్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

ప్రతిరోజు ఆమె కాంట్రాక్టర్లను వేధించి ఇంటికి రూ.లక్షల్లో డబ్బు తెస్తోందని వీడియోలో ఆరోపించారు. ఆమె తన సోదరు లకు రూ.కోట్లలో అప్పులు ఇచ్చిందని వెల్లడించారు. తీరు మార్చుకోవాలని తాను ఎన్నోసార్లు హితవు పలికినా పెడచెవిన పెట్టిందని వెల్లడించారు. కాగా, మణి కొండ మున్సిపాలిటీలో దివ్యజ్యోతి భారీస్థాయిలో అవినీతికి పాల్పడినట్లు సిబ్బందితో పాటు నేతలు ఆరోపించడం గమనార్హం. 

అవినీతి డబ్బుతో పెంచను: శ్రీపాద 

నా కొడుకును అవినీతి డబ్బుతో పెంచనని శ్రీపాద పేర్కొన్నారు. దివ్యజ్యోతి ఆరోపణలపై ఆయన స్పందించారు. దివ్యజ్యోతి తమ్ముళ్లు చాలా క్రిమినల్ మైండెడ్ వ్యక్తులని ఆరోపించారు. ఎవరైనా అక్కాబావను కలపడానికి ప్రయత్నిస్తారని, దివ్య జ్యోతి సోదరులు అలా కాదని అన్నారు. దివ్యజ్యోతి పది రోజుల క్రితం జీహెచ్‌ఎంసీకి బదిలీ అయిన విషయం కూడా తనకు తెలియదన్నారు.

తాను డబ్బులకు ఆశపడే వ్యక్తి ని కాదని, అలా అయితే తన భార్య ఏం చేసి నా ఊరుకునే వాడిని కదా అని అన్నారు. దివ్యజ్యోతి తమ్ముళ్లు తన కుమారుడిని కనిపించకుండా చేస్తున్నారని మండిపడ్డారు. దివ్యజ్యోతి తమ్ముడు శరత్‌కుమార్ ఆమెను పూర్తిగా నాశనం చేశాడని ఆరోపించారు.

లంచాల సొమ్ముతో తన కొడుకు బతకొద్దని, తాను కష్టం చేసుకొని అతడిని పెంచు తానని శ్రీపాద కన్నీటిపర్యంతమయ్యారు. తాను కుమారుడితో మాట్లాడాలని నాలుగు నెలలుగా ప్రయత్నిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని, పలుమార్లు కాల్ చేసినా కట్ చేస్తోందని, కోర్టులో తీర్పు వచ్చాకే ఏదైనా ఉంటే చూసుకుందామని అంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

కక్షతోనే చేస్తున్నాడు: దివ్యజ్యోతి

తనపై కక్షతోనే భర్త శ్రీపాద ఆరోపణలు చేశారని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని డీఈఈ దివ్యజ్యోతి స్పష్టం చేశారు. తమ మధ్య కొంతకాలంగా కలహాలు ఉన్నాయని, తాము ఇద్దరం వేరుగా ఉంటు న్నామని పేర్కొన్నారు. తాము విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. తాను వరకట్నం వేధింపుల కేసు పెట్టడంతో ఆయన కక్షగట్టి తనను బద్నాం చేస్తున్నారని ఆరోపించారు.