25-02-2025 12:53:56 AM
మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో అక్రమ నిర్మాణ పనులను అడ్డుకున్న మున్సిపల్ సిబ్బంది
కామారెడ్డి, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి), అనుమతులు ఓ రకం... భవన నిర్మాణాలు మరోరకం. శీర్షికతో విజయ క్రాంతి దినపత్రికలో ఈనెల 22న వచ్చిన కథనానికి మునిసిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి స్పందించారు. విజయ క్రాంతి పత్రికలో వచ్చిన కథనం చదివిన మున్సిపల్ కమిషనర్ వెంటనే అక్రమ నిర్మాణం పనులు ఆపాలని మున్సిపల్ సిబ్బంది ఆదేశాలు చేశారు.
మున్సిపల్ కార్యాలయానికి సమీపంలోనే మూడంతస్తుల భవన నిర్మాణానికి అనుమతిని తీసుకొని ఐదు అంతస్తులు నిర్మాణం చేపడుతున్న విషయాన్ని విజయ క్రాంతి దినపత్రికలో వచ్చిన కథనాన్ని చూసి వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటామని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి విజయశాంతి ప్రతినిధితో తెలిపారు.
కామారెడ్డి బల్దియా ఆదాయానికి గండి కొడుతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిని గుర్తించి పనులు నిలుపుదల చేయడంతో పాటు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి తెలిపారు. కుళాయి పన్నులు, ఇంటి టాక్స్ చెల్లించాలని కోరారు. మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టే వారిని గుర్తించి పెనాల్టీలు విధిస్తామని తెలిపారు.
మునిసిపల్ స్థలాలను కబ్జా చేస్తే నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఎవరిని ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రోడ్లలో మురికి కాలువలను కబ్జా చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించే వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమ నిర్మాణం పనులు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ సిబ్బంది అక్రమ నిర్మాణం చేపడుతున్న వారిని హెచ్చరించారు. స్థానికులు రాతపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు విజయక్రాంతి పత్రికల్లో వచ్చిన కథనాన్ని పరిశీలించి జిల్లా కలెక్టర్కు నివేదిక పంపిస్తామని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.