21-02-2025 01:20:59 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశంలోని హైకోర్టు న్యాయమూర్తులను కూడా లోక్పాల్, లోకాయుక్త చట్టం-2013 కింద విచారించే అధికారం తమకు ఉందంటూ లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు లోక్పాల్ రిజిస్ట్రీకి కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 27వ తేదీన లోక్పాల్ జారీ చేసిన ఆదేశాలపై సుప్రీం సుమోటోగా కేసును విచారించింది.
అసలేం జరిగిందంటే..
లోకాయుక్త చట్టం-2013 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను కూడా విచారించే అధికారం తమకు ఉందని జనవరి 27న లోక్పాల్ ఉత్తర్వులు జారీ చేయగా.. గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచా రణ చేపట్టింది. ‘ఈ ఆదేశాలు చాలా ఆందోళనకరం. న్యాయవ్యవస్థ స్వాతంత్య్రంపై ఇది ప్రభావం చూపుతుంది. హైకోర్టు న్యాయమూర్తులు ఎప్పటికీ లోక్పాల్, లోకాయుక్త -2013 చట్టం పరిధిలోకి రారు’.
అని బెంచ్ అభిప్రాయపడింది. హైకోర్టు న్యాయమూర్తి పేరును గోప్యంగా ఉంచాలని ఫిర్యాదుదారుడికి తెలిపింది. ఓ ప్రైవేటు కంపెనీ కేసులో కంపెనీకి లాభం చేకూర్చేందుకు ఓ హైకోర్టు న్యాయమూర్తి జిల్లా కోర్టు న్యాయమూర్తితో పాటు మరో హైకోర్టు న్యాయమూర్తిని ప్రభావితం చేశాడన్న ఆరోపణలపై లోక్పాల్ పై విధంగా నిర్ణయం తీసుకుంది.