24-03-2025 12:21:02 PM
ప్రాణం తీసిన దిమ్మె కులక్చర్ల మండలం అల్లాపూర్ తండాలో విషాదం
పరిగి,(విజయక్రాంతి): అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ నాలుగేళ్ల కొడుకును అంగన్వాడీ ఆవరణలో ఉన్న దిమ్మె మింగేసిందంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కులకచర్ల మండలం అల్లాపూర్తండాకు చెందిన విస్లావత్ లక్ష్మణ్-కోమల్ దంపతులకు విస్లావత్ సాయి(4) కొడుకు ఉన్నాడు. స్థానిక తండాలోని అంగన్వాడి సెంటర్(Anganwadi Center) చదువుకునేందుకు వెళ్తాడు.ఎప్పటిలాగే సోమవారం ఉదయం కూడా అంగన్వాడి సెంటర్ కి వెళ్ళగా ఆవరణలో ఉన్న ఉపాధి హామీ పనులకు సంబంధించిన దిమ్మె ఇస్లావత్ సాయి పై పడింది.
దీంతో సాయికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే ఇస్లావత్ సాయిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో ఇస్లావత్ సాయి బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన బాలుడు తల్లిదండ్రులు ఆస్పత్రి వద్ద బోరున విలపించారు.ఈ దిమ్మె ప్రమాదకరంగా ఉందని కొంతకాలంగా గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శికి అప్పటి సర్పంచి దృష్టికి తీసుకు వచ్చిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముక్కు పచ్చలారని బాలుడు చనిపోవడంతో ఆస్పత్రిలో ఉన్న వారంతా అయ్యో పాపం అని అనుకున్నారు.