calender_icon.png 13 October, 2024 | 10:41 PM

విశ్వంలో ఇద్దరం ప్రయాణికులం

09-10-2024 12:00:00 AM

గోపీచంద్, కావ్య థాపర్ జంటగా దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్‌లో వస్తున్న చిత్రం ‘విశ్వం’. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో గోపీచంద్ మాట్లాడుతూ “సినిమాను రిస్క్‌తో కూడిన ప్రాంతాల్లో షూట్ చేశాం. డైరెక్టర్ శ్రీనుతో ఎప్పటి నుంచో వర్క్ చేయాలని అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది” అని అన్నారు. హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ “శ్రీను వైట్ల హీరోయిన్ అనే ట్యాగ్ నాకు చాలా ఆనందాన్నిచ్చింది. గోపీచంద్‌తో డ్యాన్స్ ఎంజాయ్ చేశాను” అని తెలిపారు.

డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ “విశ్వం సినిమా ఒక అందమైన ప్రయాణం. దీనిలో గోపీచంద్ నా తోటి ప్రయాణికుడు. గోపి మద్దతు వల్ల్లే తాను అనుకున్నది అనుకున్నట్లుగా తీయగలిగాను. కచ్చితంగా ఈ సినిమా నాకూ, గోపికి మంచి సక్సెస్ అందిస్తుంది” అని పేర్కొన్నారు.

ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ “యూఎస్‌లో ఉన్నప్పుడు శీను వైట్ల సినిమాలు సంచలనాత్మకం. ఈ సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను రంజింపజేస్తుంది” అని తెలిపారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ వేణు మాట్లాడుతూ ‘నాకు ఇది ఫస్ట్ ఫిలిం. మా హీరో సినిమా అని అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉంటుంది’ అన్నారు.