calender_icon.png 23 October, 2024 | 8:48 AM

జోరందుకున్న రియల్ ఎస్టేట్

10-07-2024 04:57:45 AM

  • కొత్త ప్రభుత్వంలో పెరిగిన రిజిస్ట్రేషన్లు 
  • పుంజుకున్న కొత్త భవన నిర్మాణాలు 
  • 7 నెలల్లో రూ.4,670 కోట్ల ఆదాయం

హైదరాబాద్, జులై 9 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకున్నది. భవనాలు, లే అవుట్ల అనుమతులతో పాటు ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు పెరగడమే అందుకు నిదర్శనమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్రాంతాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య, డాక్యుమెట్ల రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదా యం పెరిగాయని, కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతుల సంఖ్య కూడా పెరిగిం దని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్‌తో దాదాపు మూడు నెలల పాటు ఆర్థిక లావాదేవీలు స్తంభించినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే స్థిరాస్తి రంగం పుంజుకోవటం గమనార్హం. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ డెవెలప్‌మెంట్ ప్రాజెక్టు, మెట్రోరైలు విస్తరణ, సికింద్రాబాద్ నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే రెండు ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణంతో రాబోయే రోజుల్లో నగరం రూపురేఖలే మారిపోతాయని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు రీజినల్ రింగ్‌రోడ్డు వరకు హెచ్‌ఎండీఏ పరిధి విస్తరించే ప్రణాళికలు, నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించడంతో స్థిరాస్థి రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడింది.

పెరిగిన ఆదాయం

గతంతో పోలిస్తే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటినుంచి ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ. 4,670.52 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు ఏడు నెలల్లో అంటే మే 2023 నుంచి నవంబర్ 2023 వరకు రూ. 4,429.23 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే కొత్త ప్రభుత్వం వచ్చాక రూ.241.29 కోట్ల ఆదాయం పెరిగిందని సంబంధిత శాఖ వర్గాలు చెబుతున్నాయి. రోజురోజుకు విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగం వృద్ధికి ఇదే సంకేతమని చెబుతున్నారు.

2022 డిసెంబర్ నుంచి 2023 జూన్ వరకు ఇదే వ్యవధితో పోల్చినా రూ.270.86 కోట్లు అదనంగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. గత ఏడు నెలల్లో జరిగిన మొత్తం రిజి స్ట్రేషన్ల సంఖ్య 2,18,160గా ఉండగా ఇది గతేడాది ఇదే వ్యవధిలో 1,93,962 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే 12.5 శాతం రిజి స్ట్రేషన్ల సంఖ్య పెరిగిందని  ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 54,111 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత ఏడాది ఇదే వ్యవధిలో 50,535 ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు అయ్యాయి.

అప్పటితో పోలిస్తే 7 శాతం పెరుగుదల నమో దైంది. డిసెంబర్ 7 నుంచి జూన్ 30 వరకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో అనుమతిచ్చిన భవనాల దరఖాస్తుల సంఖ్య 18,077 ఉండగా, మే నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు 17,911 భవనాలకు అనుమతుల ఇచ్చారు. జీహెచ్‌ఎంసీలో ఏడు నెలల్లో ఆమోదించిన భవన నిర్మాణ అనుమతులు 7,809 ఉండగా అంతకుముందుతో పోలిస్తే 13.17 శాతం పెరిగింది.