రాష్ట్రమంతా బోనాల కళ కనపడుతోంది. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ పేరేదైనా.. మదిలోని భక్తితో అమ్మలక్కలంతా బోనాన్ని ఆ తల్లికి సమర్పిస్తున్నారు. ఈ తరుణంలో హీరోయిన్ తమన్నా కూడా ఆ ఆచారాన్ని అందుకున్నారు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ‘ఓదెల 2’ సినిమాలో తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓదెల మల్లన్న గుడి సెట్ని నిర్మించారు. ఎనిమిది వందల మంది జూనియర్ ఆర్టిస్టులు భాగమైన ఈ షెడ్యూల్లో తమన్నా సహా ఇతర నటీనటులతో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
సినిమాలోనూ బోనాలకు సంబంధించిన సన్నివేశం ఉండగా.. అందుకోసం నిండుగా చీరకట్టి.. నెత్తిన బోనం పెట్టి నడిచివచ్చింది కథానాయిక తమన్నా. బోనాల సంబరాలను పురస్కరించుకొని సినిమాలోని ఈ పోస్టర్ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వాస్తవిక ఘటనల ఆధారంగా రూపొందిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఉత్కంఠభరితమైన మరో కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగంలో నటించిన హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ఈ సినిమాలోనూ కనపడనున్నారు. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్: సౌందర్రాజన్, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్.