టెల్ అవీవ్, సెప్టెంబర్ 20: లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లాపై ఇజ్య్రాయెల్ విరుచుకుపడుతున్నది. భీకర వైమానిక దాడులతో విధ్వంసం సృష్టిస్తున్నది. ఒకవైపు సైబర్ దాడులతో ఉగ్రవాదులతోపాటు లెబనాన్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ మరోవైపు హెజ్బొల్లా ఆయుధ బలాన్ని నేలమట్టం చేసే వ్యూహాన్ని అమలుచేస్తున్నది. గురువారం రాత్రి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు హెజ్బొల్లా ఆయుధ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి.
ఈ దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన దాదాపు 100 రాకెట్ లాంచ్పాడ్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ లాంచ్పాడ్లలో ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచిన వెయ్యి వరకు బారెల్స్ను నాశనం చేసినట్లు వెల్లడించింది. పేజర్లు, వాకీటాకీలను పేల్చినందుకు ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకొంటామని హెజ్బొల్లా అధినేత హసన్ నస్రుల్లా ప్రకటించిన గంట సేపటిలో ఈ దాడులు జరగటం గమనార్హం.